Begin typing your search above and press return to search.

వైసీపీ ఆఫీసుకు టీడీపీ ఆటంకాలు

By:  Tupaki Desk   |   5 Nov 2016 1:44 PM IST
వైసీపీ ఆఫీసుకు టీడీపీ ఆటంకాలు
X
పాలనతో పాటు పార్టీలు కూడా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలిపోయినా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఇంకా హైదరాబాద్ పై ప్రేమ చంపుకోలేక అక్కడి లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేస్తోంది. దీంతో వెనకబడిపోతున్నామంటూ పార్టీ నేతలు గగ్గోలు పెడుతుండడంతో అమరావతి ఏరియాలో లేదంటే విజయవాడలో ఆఫీసు కోసం ఏర్పాట్టు చేయాలని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే... దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా జగన్ ఓకే చెప్పినా రాజధాని ప్రాంతీయులు మాత్రం వైసీపీ ఆఫీసు అనగానే స్థలం కానీ, భవనం కానీ ఇవ్వడానికి ఇష్టపడడం లేదట. అదేదో వైసీపీ అంటే భయంతో కాదు... రాజధాని ఏరియా - విజయవాడ అంతా అధికార పార్టీ హవా నడుస్తుండంతో వారి ఒత్తిళ్లు అధికమై వైసీపీ ప్రయత్నాలకు బ్రేకులు పడుతున్నాయని సమాచారం.

వైసీపీ నేతలు కొద్దికాలం నుంచి పార్టీ ఆఫీసు - జగన్ ఇంటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. అధికార పార్టీకి భయపడి తమకు స్థలం ఇవ్వాలంటేనే భయపడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ముందుగా గుంటూరు సమీపంలోని రెడ్డిపాలెంలో స్థలం కోసం అన్వేషించారు. స్థలం - అన్నీ బాగున్నా అది రాజధానికి దూరం కావడంతో పాటు భద్రతా కోణంలో సురక్షితం కాకపోవడంతో జగన్ దానిపై విముఖత చూపారు. విజయవాడపైనా జగన్ విముఖతగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వెలగపూడిలోనే సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తున్నందున అక్కడికి సమీపంలో స్థలం తీసుకుంటే బాగుంటుందని పార్టీ నేతలు జగన్ కు సూచించారు. దాంతో కొద్దికాలం నుంచి నేతలు ఆ ప్రాంతంలో స్థలం కోసం వెతికినా ఎక్కడ దొరకలేదు. మంగళగిరి సమీపంలో స్థలాలు ఉన్నప్పటికీ జగన్‌కు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట... జగన్‌ కు స్థలం ఇస్తే అధికార పార్టీ నుంచి ఎక్కడ ఇబ్బందులొస్తాయననే భయంతో చాలామంది వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు.

చివరకు జగన్‌ కు సన్నిహితుడైన బాలాజీరెడ్డి అనే వ్యక్తి తన స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చారని.. కానీ.. జగన్ మాత్రం వెలగపూడికి సమీపంలో అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో కాస్త ఆలస్యమైనా అక్కడే సంపాదించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/