Begin typing your search above and press return to search.

నంద్యాల లో టీడీపీ బాల ప్ర‌చార‌కులు!

By:  Tupaki Desk   |   14 Aug 2017 3:51 PM GMT
నంద్యాల లో టీడీపీ బాల ప్ర‌చార‌కులు!
X
భూమా నాయ‌క‌త్వం వ‌ర్థిల్లాలి.....చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌ర్థిల్లాలి.... నంద్యాల ఉప ఎన్నికల ప్ర‌చారంలో ఇటువంటి నినాదాలు వినిపించ‌డం స‌హ‌జ‌మే. అయితే, అధికార పార్టీ త‌ర‌పున ఈ నినాదాలతో ప్ర‌చారం చేస్తున్న‌ది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌నుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే! భావి భార‌త పౌరులు కావ‌ల‌సిన విద్యార్థులు టీడీపీ జెండాలు మోస్తూ....టీడీపీకి అనుకూల నినాదాలు చేస్తూ రోడ్ల‌పైన‌ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం నిర్వ‌స్తున్నారు. మెడ‌లో టీడీపీ కండువాలు వేసుకొని భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓటేయాలంటూ పిలుపునిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో టీడీపీ నానాటికీ దిగ‌జారిపోతోంది. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ విడుద‌ల కాక ముందు నుంచే మంత్రులు - టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాల‌లో తిష్ట వేసిన సంగ‌తి తెలిసిందే. సాక్ష్యాత్తు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా నంద్యాల‌లో తీవ్రంగా ప్ర‌చారం నిర్వహించి ఓట‌ర్ల‌ను ప్రలోభ‌పెట్టారు. ఆఖ‌రికి టీడీపీ.... చిన్న పిల్ల‌ల‌ను కూడా ప్ర‌చారానికి వాడుకుంటోంది. సెల‌వుల‌లో ఆట‌విడుపుగా గ‌డ‌ప‌వ‌ల‌సిన బాల‌ల‌కు డ‌బ్బు ఎర‌జూపి త‌మ స్వార్థానికి ఉప‌యోగించుకుంటోంది. త‌మ ప్ర‌చార ల‌బ్దికి వారిని పావుల‌ను చేసింది.

పెద్దోళ్ల‌కు 200 రూపాయ‌లు - త‌మ‌కు 100 రూపాయ‌లిచ్చి వీధుల్లో ప్ర‌చారం చేయ‌మ‌ని (చంద్ర‌బాబు పార్టీ) టీడీపీ కార్య‌క‌ర్త‌లు చెప్పార‌ని ఆ పిల్ల‌లు వెల్ల‌డించారు. త‌మ‌కు డ‌బ్బులిస్తామ‌ని ఆశ చూప‌డంతో వీధి వీధి తిరిగి టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నామ‌ని, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓటేయ‌మ‌ని చెబుతున్నామ‌ని వారు తెలిపారు. పొద్దున్నుంచి సాయంత్రం వ‌ర‌కు తిరిగితే 100 రూపాయ‌లిస్తున్నార‌ని, సాయంత్రం ఒక్క‌పూట‌ తిరిగితే 50 రూపాయ‌లిస్తున్నార‌ని పిల్ల‌లు చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి పిల్ల‌ల‌ను వాడుకోవ‌డం టీడీపీ దిగ‌జారుడుతనానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. బాల్యంలోనే పిల్ల‌ల‌ను ఈ ర‌కంగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోవ‌డం వ‌ల్ల వారి బంగారు భ‌విష్య‌త్తు నాశ‌న‌మ‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.