Begin typing your search above and press return to search.

చంద్రబాబు బొమ్మ ముందు పిండప్రదానాలు

By:  Tupaki Desk   |   19 Aug 2016 8:31 AM GMT
చంద్రబాబు బొమ్మ ముందు పిండప్రదానాలు
X
తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు అంటే ఉన్న అభిమానం మామూలుగా ఉండదు. అయితే... ఆ అభిమానంలో ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద టీడీపీ కార్యకర్తలు చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. తెలుగు తమ్ముళ్లు ఏకంగా అక్కడ చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆ బొమ్మ ఎదురుగా కూర్చుని పిండప్రదానాలు చేయడం మొదలుపెట్టారు.

సాధారణంగా పిండ ప్రదానాల వద్ద మరణించిన వారి చిత్రాలు ఉంచుతారు. కానీ.. ఇలా ఒక ముఖ్యమంత్రి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి అక్కడ పిండ ప్రదానాలు చేయడం కరెక్టు కాదని పలువురు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అపరకర్మల గురించి తెలిసినవారైతే ఇది చాలా తప్పని హెచ్చరిస్తున్నా వినేవారే కరవవుతున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది కూడా ఆ విషయాన్ని సీరియస్‌ గా పట్టించుకోలేదు. దీంతో వందలాది మంది చంద్రబాబు సైకత శిల్పాన్ని ఎదురుగా పెట్టుకుని పిండప్రదానాలు చేసేస్తున్నారు.

కొందరు దీన్ని గుర్తించి అలా పిండప్రదానాలు చేస్తున్న వారిని అక్కడ వద్దంటూ వారించి వేరే చోట్లకు పంపిస్తున్నారు. అయితే, చాలామంది మాత్రం సైకత శిల్పం ఉండడంతో అదే మంచి లొకేషన్ అనుకుంటూ అక్కడే పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక టీడీపీ నేతలు స్పందించి ఆ బొమ్మను తొలగించడమో లేదంటే అక్కడ పిండ ప్రదానాలు చేయకుండా చూడడమో చేస్తే బాగుంటుంది.