Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ప‌వ‌న్‌ కు మిత్ర‌ప‌క్షం రెడీ

By:  Tupaki Desk   |   11 April 2017 4:36 AM GMT
తెలంగాణ‌లో ప‌వ‌న్‌ కు మిత్ర‌ప‌క్షం రెడీ
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్లుగా ఆయ‌న‌తో జ‌ట్టుక‌ట్టేవారు ముందుకు వ‌చ్చేస్తున్నారు. ప‌వ‌న్ కు ప‌ట్టున్న ఏపీలో ఒక‌ట్రెండు పార్టీల నుంచి ఇలాంటి ప్ర‌తిపాద‌న ఇప్ప‌టికే రాగా...తాజాగా తెలంగాణ‌లోనూ అదే ఆఫ‌ర్ వ‌చ్చింది. కలిసొచ్చే పార్టీలతో బలమైన రాజకీయ శక్తిగా ఐక్య వేదిక ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇందులో భాగంగానే జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తో చ‌ర్చ‌లు జరపనున్నామని తెలిపారు. మేలోగా స్పష్టత వస్తుందని అన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరాంతో కూడా చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకం కావడానికి తెలంగాణలో 154 రోజుల పాటు పాదయాత్ర చేసి ఇటీవల నగరానికి చేరుకున్న తమ్మినేని వీరభద్రం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి కమ్యూనిస్టులు, సామాజిక శక్తులు కలిసి ముందుకు సాగుతామని, బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తామని త‌మ్మినేని ధీమాగా చెప్పారు. టీఆర్‌ ఎస్‌ లో అంతర్గతంగా తగాదాలు వస్తే వాటిని తమకు అనుకూలంగా మలచుకుని ఎదగవచ్చని బీజేపీ ఎదురు చూస్తున్నదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఎం-సీపీఐలది జన్మజన్మల బంధం అని తమ్మినేని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దేశానికి వామపక్షాలే ప్రమాదకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పడం గురించి ప్రశ్నించగా, తాము బలంగా ఉన్నందుకే విమర్శలు చేస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. తానే అసలైన కమ్యూనిస్టునని ముఖ్యమంత్రి చెప్పుకోవడం గురించి త‌మ్మినేని స్పందిస్తూ నియంతృత్వ పోకడలతో ఉన్న కేసీఆర్‌ కు ఆ అర్హత లేదని అన్నారు.

ప్రజలు కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా, పాలన మాత్రం వారి ఆకాంక్షలకు అనుగుణంగా జరగడం లేదని త‌మ్మినేని వీర‌భ‌ద్రం విమర్శించారు. జీడీపీ పెరిగిందని, 21 శాతం అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తాను 1520 గ్రామాల్లో పాదయాత్ర చేశానని, ఎక్కడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని త‌మ్మినేని వీర‌భ‌ద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఉన్న పరిస్థితులే నేడూ ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఉండడం లేదని, గిరిజన గర్భిణులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. పత్తి, కంది పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయేంత వరకు 70 వేల కోట్ల అప్పులు చేస్తే, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో 70 వేల కోట్లు అప్పు చేసిందని త‌మ్మినేని విమర్శించారు. సమగ్ర సబ్-ప్లాన్ చట్టాన్ని చేయాల్సి ఉండగా, వచ్చే ఏడాదికి వాయిదా వేయడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కల్లు గీత కార్మికులు, చాకలి, గొర్రెల కాపర్లు తదితర వృత్తుల వారు అక్కడే ఉండాలా? వారి జీవన స్థితిగతులు మారవద్దా? అని తమ్మినేని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/