Begin typing your search above and press return to search.

సీతారామ్ గారు... మీరు స్పీక‌ర్ హోదాలో ఉన్నారు స‌ర్‌!

By:  Tupaki Desk   |   31 Oct 2020 9:15 AM IST
సీతారామ్ గారు... మీరు స్పీక‌ర్ హోదాలో ఉన్నారు స‌ర్‌!
X
ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు హుందా అనే ప‌దం `బూత‌ద్దం` పెట్టిన‌ వెతికిన దొర‌క‌ని సంగ‌తి తెలిసిందే. నేత‌ల విమ‌ర్శ‌లు అడ్డూ అదుపు లేని స్థితికి చేరిపోయాయి. అధికార పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తుంటే గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధులు అనే ప‌దం స‌రైన‌దేనా అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రుల స్థాయిలో ఉన్న నేత‌లు ప్ర‌స్తావిస్తున్న ప‌దాలు ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణం. అయితే, రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన హోదాలో ఉండే ప్ర‌జాప్ర‌తినిధులు సైతం ఇదే త‌ర‌హా మాట‌లు మాట్లాడుతున్నార‌ని ప‌లువురు ఆవేద‌న చెందుతున్నారు. అలాంటి వారి జాబితాలోకి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ చేరుతార‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.

గ‌తంలో ప‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మరోసారి అలాంటి కామెంట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం త‌మ్మినేని సీతారామ్ మాట్లాడుతూ టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. పేదల కోసం మాట్లాడే టీడీపీ నేతలు, చంద్రబాబు ఇళ్ల పట్టాల విషయంలో ఎందుకు కోర్టులకు వెళ్లారో సమాధానం చెప్పాలని సీతారామ్ డిమాండ్ చేశారు. పేదలకు మేలు జరుగుతుంటే చంద్ర బాబు ఎందుకంత అసూయ పడుతున్నారని ప్రశ్నించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల రాకుండా చేశారని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు అని త‌మ్మినేని సీతారామ్‌ ప్రశ్నించారు. ఆ అనుభవం దేనికి? ఎక్కడ పెట్టుకోవడానికి ? అంటూ త‌మ్మినేని సీతారామ్ ఘాటుగా విమర్శించారు.

గ‌తంలో సభాపతి తమ్మినేని సీతారామ్ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. న్యాయ వ్యవస్థ పాలన వ్యవస్థను అదుపు చేయడం సరికాదని అన్నారు. ఆయా వ్యవస్థలకు నిర్దిష్ట పరిమితులు, బాద్యతలు ఉన్నాయని అన్నారు. ఒక వ్యవస్థ హద్దు దాటి మరో వ్యవస్థలోకి వెళ్లడం సరైనది కాదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల తీరుపై ప్రజలలో చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మరో వ్యవస్థ హద్దులు దాటి అడ్డుకునేయత్నం చేయడం సరికాదని అన్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగవలసిన అవసరం ఉందని సీతారామ్ అన్నారు.