Begin typing your search above and press return to search.

కరోనా ముప్పును తప్పించుకున్న డాక్టర్ డెంగ్యూతో మరణించాడు

By:  Tupaki Desk   |   16 April 2020 4:15 AM GMT
కరోనా ముప్పును తప్పించుకున్న డాక్టర్ డెంగ్యూతో  మరణించాడు
X
ఇప్పుడు నడుస్తున్నదంతా కరోనానే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి పుణ్యమా అని.. మిగిలిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఎవరికి పట్టటం లేదు. మందులేని ఈ వైరస్ బారిన పడిన వారు ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా.. వారి ప్రాణాల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. దేశంలో కరోనా మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని చెప్పాలి. ఇందుకు.. భారత్ లోని వైద్యుల్ని ప్రశంసించాల్సిందే. ఇలాంటివేళ.. తమిళనాడులో చోటు చేసుకున్న ఒక వైనం షాకింగ్ గా మారింది.

నీలగిరి జిల్లాలోని సిరాముగయ్ ప్రాంతానికి చెందిన ముప్ఫై ఏళ్ల జయమోహన్ అనే వ్యక్తి ప్రభుత్వ వైద్యుడిగా వ్యవహరిస్తున్నారు. సదరు జిల్లాలోని తెంగుమర్హడ అనే గిరిజన గ్రామంలో వైద్యసేవల్ని అందిస్తున్నారు. కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఆయన మాత్రం ఆ మహ్మమారి బారిన పడకుండా తప్పించుకున్నారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇటీవల కాలంలో ఆయనకు అధిక జ్వరం వచ్చేది.

దీంతో.. కరోనాగా అనుమానించిన వైద్యులు హుటాహుటిన నీలగిరి జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న వైద్యులు.. ఆయన్ను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఆయనకు డెంగ్యూగా తేలింది. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి చేర్చిన గంటల వ్యవధిలోనే మరణించారు. మందు లేని కరోనా వేళ.. ఆ మహమ్మారిని తప్పించుకున్న వైద్యుడు.. ముందు ఉన్నప్పటికి డెంగ్యూ బారిన పడి మరణించటానికి మించిన విషాదం ఏముంటుంది చెప్పండి?