Begin typing your search above and press return to search.

హీరో విజ‌య్ తీరు రాజ‌ద్రోహ‌మే.. హైకోర్టు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   13 July 2021 11:30 AM GMT
హీరో విజ‌య్ తీరు రాజ‌ద్రోహ‌మే.. హైకోర్టు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!
X
కోలీవుడ్ స్టార్ హీరో థ‌ళ‌ప‌తి విజ‌య్ పై మ‌ద్రాసు హైకోర్టు తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న చ‌ర్య రాజ‌ద్రోహ‌మేన‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. విజ‌య్ ను మందలిస్తూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. దీంతో.. కోలీవుడ్ వర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. ఇంత‌కీ న్యాయ‌స్థానం ఎందుకు అంత తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది అన్న‌ది చూస్తే..

ల‌గ్జ‌రీ కార్ల‌లో టాప్ మోస్ట్ బ్రాండ్ అయిన‌.. రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు విజ‌య్‌. ఇప్పుకాదు.. అప్పుడెప్పుడో 2012లో ఇంగ్లాండ్ నుంచి ఆ కారును దిగుమ‌తి చేసుకున్నాడు. కానీ.. దిగుమ‌తి సుంకం చెల్లించ‌లేదు. దీంతో.. ఈ వాహ‌నాన్ని రిజిస్ట్రేష‌న్ చేసేందుకు ర‌వాణా అధికారులు తిర‌స్క‌రించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ట్యాక్స్ చెల్లించ‌లేదు విజ‌య్‌.

దీంతో.. వాణిజ్య ప‌న్నుల విభాగం అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఈ కారుకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్స్ త‌క్ష‌ణ చెల్లించాల‌ని ఉత్త‌ర్వులు జారీచేశారు. ఈ నోటీసుల‌ను స‌వాల్ చేస్తూ.. విజ‌య్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం.. ప్ర‌ముఖులుగా ఉన్న వారు స‌కాలంలో ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ఇలాంటి వారు చెల్లించే ప‌న్నులు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక‌గా ఉంటాయ‌ని తెలిపింది. ఇదేమీ స్వ‌చ్ఛంద సేవ కాద‌ని వ్యాఖ్యానించిన కోర్టు.. ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల‌తోనే పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రుల్లో సేవ‌లు స‌హా.. సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. సినిమా న‌టులు నిజ‌మైన హీరోలుగా ఉండాలే త‌ప్ప‌.. రీల్ హీరోలుగా కాద‌ని కోర్టు హిత‌వు ప‌లికింది.

ఇలాంటి వారు ప‌న్నులు ఎగ్గొట్ట‌డం ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని చెప్పిన న్యాయ‌స్థానం.. ప‌న్ను ఎగ‌వేత అనేది రాజ‌ద్రోహ‌మ‌ని తేల్చి చెప్పారు. దిగుమ‌తి చేసుకున్న కారుకు సంబంధించిన ప‌న్ను రెండు వారాల్లోగా చెల్లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు.. ఈ పిటిష‌న్ వేసినందుకు గానూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. ఈ జ‌రిమానా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి జ‌మ చేయాల‌ని ఆదేశించింది.