Begin typing your search above and press return to search.

రేవంత్‌ ను పిసికేస్తామంటున్న త‌ల‌సాని

By:  Tupaki Desk   |   17 May 2017 6:36 AM GMT
రేవంత్‌ ను పిసికేస్తామంటున్న త‌ల‌సాని
X
తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ ఘాటుగా హెచ్చరించారు. సర్కార్‌ అసమర్థ పాలన, రైతులకు గిట్టుబాటు కల్పించడం లేదంటూ ఇటీవ‌ల రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన ``గొర్రెల పెంపకంపై అవగాహన సదస్సు``లో త‌ల‌సాని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చ‌రించారు. ``నోరుంది కదా అని మైకులు పట్టి, విలేకర్లు కన్పిస్తే శివాలెత్తిపోతున్నవ్‌. టీవీల ముందు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్‌.. పిసికితే పాణం పోతది బిడ్డా..`` అని రేవంత్ రెడ్డిని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సైతం ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 2019లో గెలిస్తే రైతులకు ఒకేసారి రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని, రూ.2 లక్షలు ఆయన తండ్రి జాగీరా అని ప్రశ్నించారు.

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం గొల్లకురుమల జీవన ప్రమాణ స్థాయి పెంచాలనే ఉద్దేశంతోనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని త‌ల‌సాని అన్నారు. ఇది ఓర్వలేని కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, గొల్ల కురుమల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్ల‌ పాలనలో గొర్రెల కాపరుల గురించి ఒక్క కాంగ్రెస్‌ నాయకుడూ మాట్లాడలేదన్నారు. నేడు ప్రభుత్వం వారికి జీవాలు పంపిణీ చేస్తుంటే.. 'గొర్రెలు, చేపలు ఇచ్చి బడుగులను చదువులకు దూరం చేస్తున్నారు' అని చెప్పడం వాళ్ల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని త‌ల‌సాని మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/