Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లోకి అంజ‌న్‌ కుమార్...త‌ల‌సాని అడ్డుపుల్ల‌?

By:  Tupaki Desk   |   12 March 2019 1:30 AM GMT
టీఆర్ ఎస్‌ లోకి అంజ‌న్‌ కుమార్...త‌ల‌సాని అడ్డుపుల్ల‌?
X
తెలంగాణ కాంగ్రెస్‌ కు మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో కుంగిపోతున్న ఆ పార్టీని వలసలు మరింత దెబ్బతీస్తున్నాయి. టీఆర్‌ ఎస్‌ విసురుతున్న గులాబీ వలలో కాంగ్రెస్‌ నాయకలు ఈజీగా పడిపోతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు అత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ మధ్యవర్తిత్వంతో మహేశ్వరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తాజాగా టీఆర్‌ ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌, ఎంపీ కవితతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గత శనివారం శంషాబాద్‌ లో కాంగ్రెస్‌ నిర్వహించిన రాహుల్‌ గాంధీ బహిరంగసభ సభలో పాల్గొని, కేసీఆర్‌ ను ఘాటుగా విమర్శించిన సబితా ఇంద్రారెడ్డి ఆ వెంటనే టీఆర్‌ ఎస్‌ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ ఎస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డికి కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కే అవకాశం లేకపోవడంతో ఆమె కారెక్కుతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌ కూడా పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు.

ఇదే జాబితాలో మ‌రో ముఖ్య‌నేత సైతం కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కూడా టీఆర్‌ ఎస్‌ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఆయన కుమారుడు ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కుమారుడి కోసం అంజ‌న్ కుమార్ యాద‌వ్ గులాబీ పార్టీ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ టీఆర్‌ ఎస్‌ ప్రవేశాన్ని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్‌ లోక్‌ సభ స్థానం నుంచి తలసాని తన కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇటీవల టీఆర్‌ ఎస్‌ భవన్‌ లో జరిగిన లోక్‌ సభ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై చెప్పకనే చెప్పేసినట్టు తెలిసింది. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో పార్టీలో తనకు ప్రత్యామ్నాయ నాయకత్వం పెరుగుతుందనే ఆందోళనలో తలసాని ఉన్నట్టు స‌మాచారం.

ఒక‌ట్రెండు రోజుల్లో అంజ‌న్‌ కుమార్ యాద‌వ్ చేరిక గురించి స్ప‌ష్ట‌త రానున్న‌ట్లు స‌మాచారం. అంజ‌న్ పెట్టే ప్ర‌తిపాద‌న‌ల‌ను టీఆర్ ఎస్ ప‌రిశీలించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త‌ల‌సాని మాట‌ల‌కు విలువ ఉంటుందా? గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణయ‌మే ఫైన‌లా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.