Begin typing your search above and press return to search.

రెండు కులాలు గా విడిపోయిన టి కాంగ్రెస్ ..?

By:  Tupaki Desk   |   27 Dec 2019 6:02 AM GMT
రెండు కులాలు గా విడిపోయిన టి కాంగ్రెస్ ..?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నేత షబ్బీర్ అలీ .. తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్డి లు, బిసిలు గా విడిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించడానికి , అలాగే త్వరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి టి కాంగ్రెస్ కోర్ కమిటీ తాజాగా సమావేశమైంది. ఈ సమావేశం లో షబ్బీర్ అలీ ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు.

తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగర మోగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో ఏ వ్యూహంతో ముందుకుపోవాలి అన్నదానిపై చర్చించేందుకు టి కాంగ్రెస్ కొర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. కానీ , ఈ సమావేశం లో అవసరమైన ఆ ఒక్క అంశం పై తప్ప ..మిగిలిన అన్ని విషయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. వ్యూహాల గురించి చర్చించే బదులు, తమ వ్యక్తిగత చర్చల పై ఎక్కువ ఆసక్తి చూపించారట.

అలాగే టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పార్టీ నాయకుల తో కలత చెందారు అని తెలుస్తుంది. మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ కు వ్యతిరేకంగా అధికార అధికార టిఆర్‌ ఎస్‌ పై అయన కొన్ని విమర్శలు చేసారు. దీనితో టిఆర్‌ ఎస్ నాయకులూ ఉత్తమ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ రెచ్చిపోయారు. కానీ , ఆ దాడిని కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా ఉత్తమ్ కి సపోర్ట్ గా నిలవలేదు. దీనిపై కోర్ కమిటీలో ఉత్తమ్ పార్టీ నేతలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికలపై చర్చకు బదులు నాయకులు తమ రాజకీయ ఎజెండాతో బిజీగా ఉన్నారు అని , ప్రతి ఒక్కరు కూడా టిపిసిసి చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారని అన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ రెడ్లు మరియు బిసిలుగా విభజించబడిందని స్పష్టంగా అర్థమౌతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇకపోతే , ఈ సమావేశానికి నాన్-కోర్ కమిటీ సభ్యులను ఆహ్వానించినందుకు కలత చెందిన ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కోర్ కమిటీ సమావేశం నుండి మధ్యలోనే బయట కు వెళ్లి పోయారు. ఇది తెలంగాణ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతుంది. పార్టీలో కీలక నేతలుగా ఉన్నవారు ఒకరితో ఒకరు కలిసి పార్టీ కోసం కస్టపడి పని చేస్తే తప్ప .. తెలంగాణ లో అత్యంత బలంగా ఉన్న అధికార టిఆర్ ఎస్ ని ఓడించడం కుదరదు. అయితే , ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది దాదాపు అసాధ్యం.