Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రే న‌న్ను స్మ‌గ్లింగ్ చేయ‌మ‌న్నారు: కేర‌ళ‌లో రాజ‌కీయ దుమారం

By:  Tupaki Desk   |   8 Jun 2022 1:30 AM GMT
ముఖ్య‌మంత్రే న‌న్ను స్మ‌గ్లింగ్ చేయ‌మ‌న్నారు:  కేర‌ళ‌లో రాజ‌కీయ దుమారం
X
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కారణంగా తాను బంగారం స్మగ్లింగ్లో ఇరుక్కున్నట్లు నిందితురాలు స్వప్న సురేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2016లో సీఎం దుబాయ్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన తర్వాతే బంగారం స్మగ్లింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచారు. 2016లో సీఎం దుబాయ్ పర్యటన సందర్భంగా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్ నన్ను సంప్రదించారు. సీఎం త్రివేండ్రంలో బ్యాగ్ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్ చేర్చాలని చెప్పారు.

ఈ క్రమంలో దుబాయ్ కాన్సులేట్లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్ను ఇచ్చాను. కానీ అక్కడ స్కానింగ్లో బ్యాగ్ నిండా డబ్బు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్లో భాగం కావాల్సి వచ్చింది. అంతేకాదు.. దుబాయ్ కాన్సులేట్ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు అని ఆమె వివ‌రించారు.

ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్లు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీఎం, ఆయన కుటుంబసభ్యులు సహా ఎం శివశంకర్, మంత్రి కేటీ జలీల్, ప్రైవేట్ సెక్రటరీ సీఎం రవీంద్రన్ కూడా భాగమయ్యారని ఆరోపించారు. దీంతో ఈ కేసు మ‌రిన్ని మ‌లుపులు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.