Begin typing your search above and press return to search.

వంగవీటి రాధా ఆఫీసు ముందు స్కూటీ ఎందుకుంది? ఎవరిది?

By:  Tupaki Desk   |   30 Dec 2021 12:30 PM GMT
వంగవీటి రాధా ఆఫీసు ముందు స్కూటీ ఎందుకుంది? ఎవరిది?
X
తనను చంపటానికి రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత వంగవీటి రంగా చేసిన వ్యాఖ్యలు బెజవాడలో ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. రాజకీయంగా కలకలం రేపిన ఈ వ్యాఖ్యలపై ఏపీ సర్కారు అనూహ్యంగా స్పందించటమే కాదు.. హుటాహుటిన సెక్యురిటీని కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తనకు ఎలాంటి సెక్యురిటీ అవసరం లేదంటూ రాధా తిరస్కరించటం.. అలా ఎందుకు అంటున్నావ్.. భద్రతను వద్దని చెప్పొద్దని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినప్పటికి రాధా మాత్రం తన మాటను మార్చుకోలేదు. ఇదిలా ఉంటే.. రాధా ఆఫీసు ముందు ఒక స్కూటీ కొంతకాలంగా ఉండటం.. దాన్ని అనుమానాస్పదంగా భావించిన వంగవీటి రాధా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ వెంటనే వచ్చిన పోలీసులు.. స్కూటీని స్వాధీనం చేసుకోవటమే కాదు.. దాని యజమాని ఎవరన్నది తేల్చే పనిలో పడ్డారు. గంటల వ్యవధిలోనే ఆ స్కూటీ లెక్క తేల్చేశారు. రాధా ఆఫీసు పక్కనే ఉన్న స్వీట్ షాపులో పని చేసే వ్యక్తి స్నేహితుడిదే ఈ స్కూటీ అని తేల్చారు. వాహన పత్రాలు చూపించి వాహనాన్ని తీసుకెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు.. రాధా ఆఫీసును నిఘా వర్గాలు.. ఎస్ బీ పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది చెక్ చేశారు.

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆ పని ఎవరు చేసి ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాధా రెక్కీపై దేవినేని అవినాష్.. అరవ సత్యం కలిసి హత్యకు ప్లాన్ చేశారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఇది సంచలనంగా మారింది. అయితే.. ఈ కుట్రలో తన తండ్రికి ఎలాంటి పాత్ర లేదని.. అరవసత్యం కుమారుడు తేజ స్పష్టం చేస్తున్నారు. రాధా వ్యాఖ్యల నేపథ్యంలో.. రెక్కీ గుట్టు తేల్చే పనిలో పోలీసు వర్గాలు బిజీగా ఉన్నాయి. దీని మూలాలు తెలుసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు పోలీసులు. తనను హత్య చేశారన్న దానిపై వంగవీటి రాధా వద్ద ఎలాంటి సమాచారం ఉంది? ఆయన ఎవరిని అనుమానిస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని తెలుసుకుంటున్నారు.

ఒకవైపు తన హత్యకు ప్లానింగ్ జరిగిందని ఆరోపించిన వంగవీటి రాధా.. తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను రిజెక్టు చేయటం.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా రాధా వ్యవహారం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. బెజవాడ రాజకీయాల్ని ఒక్కసారి హాట్ హాట్ గా మార్చేసిందని చెప్పక తప్పదు.