Begin typing your search above and press return to search.

మొన్న కారు..నేడు బైక్..అంబానీ ఇంటి వద్ద ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   25 March 2021 8:13 AM GMT
మొన్న కారు..నేడు బైక్..అంబానీ ఇంటి వద్ద ఏం జరుగుతుంది?
X
పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం ఫిబ్రవరి 25 కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ప్రస్తుతం ఎన్ ఐఏ శరవేగంగా విచారణ చేస్తుంది. ఈ కేసులో విచారణ జరిగే కొద్ది అనేక విషయాలు వెలుగులోకి వాస్తు కేసు కీలక మలుపులు తిరుగుతుంది. అంబానీ ఇంటి దగ్గర ఓ వాహనం అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలైన జెలటిన్‌ స్టిక్స్ ‌తోపాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఒక లేఖ అందులో లభించాయి. మరోవైపు ఆ వాహనం గురించి పోలీసులు ఆరా తీయగా దాని యజమాని మన్ ‌సుఖ్‌ హిరెన్ ‌గా గుర్తించారు.

అయితే ఆ వాహనం యజమాని మన్‌ సుఖ్‌ హిరెన్‌ అనుమానాస్పదంగా మరణించారు. థాణే సమీపంలోని కాలువలో తేలిన ఆయన మృతదేహాన్ని నౌపాడా పోలీసులు వెలికితీశారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక సూత్రధారిగా క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌ సచిన్ వాజే ఎన్ ఐఏ అదుపులో ఉన్నారు. సచిన్‌ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. ముఖేశ్‌ హిరేన్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారని ఎన్‌ఐఏ తెలుసుకుంది. ఈ కేసులో మన్‌సుక్‌ హిరేన్‌ ఫిబ్రవరి 18వ తేదీన తన స్కార్పియో పోయిందని వికోర్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ కారు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ప్రత్యక్షమైంది. ఆ రోజు సచిన్‌ వాజే నేతృత్వంలో క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ చాలా చురుగ్గా ఈ దర్యాప్తులో పాల్గొంది. తప్పుడు పేరు, ఆధార్‌ కార్డు సాయంతో ముంబయిలోని ట్రైడెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వాజే బసచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వేరేవాళ్ల ఆధార్‌ కార్డుపై ఫొటోను మార్చి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అంతే కాదు.. ఆ హోటల్‌కు కొన్ని భారీ బ్యాగులను కూడా తీసుకొచ్చినట్లు సీసీటీవీ పుటేజీల్లో తేలింది. వాజే హోటల్లో బసచేసినప్పుడు ఎవరెవరు కలిశారనే అంశాన్ని ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది.

ఈ కేసు విచారణ ఇలా కొనసాగుతున్న సమయంలో మరో ఊహించని పరిణామ చోటుచేసుకుంది. అంబానీ ఇంటి సమీపంలో ఓ బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంచడం కలకలం సృష్టిస్తుంది. ఈ బైక్ వివరాలు ఆర్ టి ఏ అధికారుల వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. గతంలో స్కార్పియో పార్క్ చేసిన ప్రదేశంలోనే ఈ బైక్ పార్క్ చేసి ఉన్నట్లు అధికారులు గుర్తించారని ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త ప్రచారం అవుతుంది. దీనిపై గన్ దేవి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే అసలు ఆ స్కార్పియో ఎందుకు అపి ఉంచారో తెలియక తలలు పట్టుకుంటున్న సమయంలో మరో బైక్ ఇప్పుడు అనుమానాస్పదంగా ప్రత్యక్షం అవ్వడంతో మరో కొత్త సమస్య వచ్చి పడింది. దీనితో అసలు అంబానీ ఇంటి వద్ద ఏంజరుగుతుంది అని అందరూ చర్చించుకుంటున్నారు.