Begin typing your search above and press return to search.

ప్రభు దయ; ప్రత్యేక జోన్.. ఒక కొత్త రైలు

By:  Tupaki Desk   |   18 Jun 2016 6:53 AM GMT
ప్రభు దయ; ప్రత్యేక జోన్.. ఒక కొత్త రైలు
X
తగువుతోనో.. మనసును నొప్పించో.. ఒత్తిడితోనో పని చేయించుకున్నా దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదని బలంగా నమ్మినట్లు కనిపిస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అందుకే.. మిత్రుడిగా ఏపీకి చాలానే చేయాల్సి ఉన్నా. .ఏమీ చేయని కేంద్రంపై తొందరపాటుగా విరుచుకుపడకుండా స్నేహంతోనే అన్ని సాధించుకోవాలన్న ఆయన పట్టుదలకు మోడీ సర్కారు కాస్త కరిగినట్లుగా కనిపిస్తోంది. మిత్రధర్మంలో భాగంగా మొన్నా మధ్య రాజ్యసభకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ఏపీ తరఫున రాజ్యసభకు పంపే విషయంలో కీలకభూమిక పోషించిన చంద్రబాబు సాయానికి రిటర్న్ గిఫ్ట్ లభించినట్లుగా చెప్పొచ్చు.

స్వయంగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభునే రాజ్యసభకు పంపిన దానికి బదులుగా.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేక జోన్ అంశంపై కీలక అడుగు పడినట్లుగా చెబుతున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి రెండేళ్లు అవుతున్నా ప్రత్యేక రైల్వేజోన్ ఏపీకి ఇవ్వాలన్న అంశంపై పెద్దగా స్పందించని దానికి భిన్నంగా తాజాగా వడివడి అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. సౌత్ ఈస్ట్ కోస్ట్ జోన్ పేరిట కొత్త రైల్వే జోన్ ను వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.ఈ విషయాన్ని త్వరలోనే కేంద్రమంత్రి సురేశ్ ప్రభు అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 27 నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపీ సచివాలయం షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఫ్యామిలీలు ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఒక కొత్త రైలు ఏర్పాటు చేయాలన్న ఉద్యోగుల కోర్కెను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రి ముందు పెట్టటమే కాదు.. దాన్ని సాధించుకోవటం గమనార్హం. వారానికి మూడు రోజుల పాటు నడిచే ఈ ప్రత్యేక రైలు సికింద్రబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనుంది. ఈ రైలును అధికారికంగా ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్నారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ రైలును ఏర్పాటు చేయటనుండటం గమనార్హం.