Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాల‌కు తీపిక‌బురు... సాగ‌ర్‌ లో సీప్లేన్స్‌

By:  Tupaki Desk   |   26 Jan 2019 4:19 AM GMT
తెలుగు రాష్ర్టాల‌కు తీపిక‌బురు... సాగ‌ర్‌ లో సీప్లేన్స్‌
X
తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొత్త అనుభూతిని సొంతం చేసుకునేందుకు రెడీగా ఉండండి. నీటిలో ల్యాండ్ అయ్యే సముద్రపు విమానాలు (సీప్లేన్స్) మ‌న‌కు అందుబాటులోకి రానున్నాయి. ఎక్క‌డో తెలుసా? నాగార్జునసాగర్‌ లో. ఔను త్వరలో సాగ‌ర్లో విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ మేరకు శుక్రవారం వివరాలను వెల్లడించారు. మొత్తం 18 రూట్లలో సీప్లేన్స్, 235 రూట్లలో ఉడాన్ కింద ఈ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు, ఇందులో 16 అన్‌ సర్వ్‌డ్ ఎయిర్‌ పోర్టులు, ఆరు వాటర్ ఏరోడ్రోమ్స్ ఉన్నాయని ఆయ‌న వివ‌రించారు.

నాగార్జునసాగర్‌ తో పాటు గౌహతి రివర్ ఫ్రంట్, అస్సాంలోని ఉమ్రాంగ్సో రిజర్వాయర్, గుజరాత్‌ లోని స్టాచూ ఆఫ్ యూనిటీ, శత్రుంజయ్ డ్యామ్, సబర్మతీ రీవర్ ఫ్రంట్‌ లలో వాటర్ ఎయిరోడ్రమ్‌ ల ద్వారా ఉడాన్ విమాన సేవలు అందించనున్నారు. సీప్లేన్‌ ల ద్వారా మొత్తం లక్ష సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఉడాన్ స్కీమ్ కింద ఏటా 69.30 లక్షల సీట్లు అందుబాటులోకి వస్తాయని సురేశ్ ప్రభు వివరించారు. ఉడాన్ కింద గౌహతి నుంచి ఢాకా, బ్యాంకాక్‌ లకు స్పైస్‌ జెట్ అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. ఉడాన్ మూడో రౌండ్‌ లో రాష్ర్టానికి చెందిన టర్బో మేఘా ఎయిర్‌ వేస్‌ తో పాటు 11 మంది ఆపరేటర్లకు రూట్లను కేటాయించారు.

స్పైస్‌ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా అనుబంధ కంపెనీ ఎయిర్‌ లైన్ అలైడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. 11 మంది ఆపరేటర్ల నుంచి వచ్చిన 73 ప్రతిపాదనలను విమానయాన శాఖ ఆమోదించింది. మొత్తం 89 ఎయిర్‌ పోర్టులు ఉడాన్ -3 కింద కనెక్టివిటీని పొందనున్నాయి. కొత్తగా కేటాయించిన 235 రూట్లలో 46 టూరిజం రూట్లు ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలను అనుసంధానం చేసే ఈ రూట్లలో ఎలాంటి ఎయిర్‌ పోర్టు రాయితీలుండవు. మిగతా రూట్లలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద విమానయాన శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 1,167 కోట్లను సమకూర్చనున్నాయి. ప్రస్తుతం మొత్తం 155 రూట్లలో ఉడాన్ విమాన సేవలు నడుస్తున్నాయి. మొదటి విడతగా 13 లక్షల సీట్లు, రెండో విడతలో 29 లక్షల సీట్లను కేటాయించారు.