Begin typing your search above and press return to search.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌పై సుప్రీం మ‌ళ్లీ విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   23 Oct 2018 10:32 AM IST
శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌పై సుప్రీం మ‌ళ్లీ విచార‌ణ‌!
X
కింది కోర్టులో ఇచ్చిన తీర్పును కాద‌ని.. పైకోర్టు మార్చేయొచ్చు. ఇలా ఊరి నుంచి మొద‌ల‌య్యే తీర్పుల మార్పు సుప్రీంకోర్టు వ‌ర‌కూ మారొచ్చు.. మార‌క‌పోవ‌చ్చు. న్యాయం చెప్పే న్యాయ‌స్థానాల్లో తీర్పు అన్న‌ది ఒక్క‌టిలానే ఉండాలి క‌దా? కొన్ని ఇష్యూల‌లో కొన్ని కోర్టుల్లో ఒక‌లా.. మ‌రికొన్ని కోర్టుల్లో మ‌రోలా తీర్పులు ఎందుకు వ‌స్తాయ‌న్న ధ‌ర్మ సందేహానికి త‌ల‌పండిన న్యాయ‌వాదులు.. న్యాయ‌స్థానాలు సూటిగా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఒక ఇష్యూలో ఒక కోర్టు ఇచ్చిన తీర్పు మార్పున‌కు అవకాశం ఉన్న‌ప్పుడు చెప్పే తీర్పు ఎంత ఆచితూచి అన్న‌ట్లు ఉండాలి. ఇదే అంశంపై కొంద‌రు న్యాయ‌నిపుణులు చెప్పే మ‌రో మాట విన్నప్పుడు అవును క‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కీ ఆ విష‌యం ఏమంటే.. ఈ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ తీర్పు చెప్పే కేసులు వ‌ర్సెస్‌.. అప్పీలులో మారిన తీర్పుల లెక్క ఎప్పుడైనా చేశారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే.. కోర్టు.. కోర్టుకు తీర్పు వ‌చ్చే విష‌యంలో మార్పున‌కు అవ‌కాశం ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి వేళ‌లో.. చెప్పే తీర్పును ఆచితూచి అన్న‌ట్లుగా చెప్పాలి. అయితే.. ఇదే పాయింట్ ను దృష్టిలో పెట్టుకొని తీర్పులిస్తే.. కేసులు కుప్ప‌లుతెప్పులుగా పేరుకుపోవ‌టం ఖాయం. ఇప్ప‌టికే.. పెండింగ్ కేసుల భారం అంత‌కంత‌కూ పెరిగిపోతున్న దుస్థితి. ఇలాంటి వేళ‌.. ఇలాంటివి మొద‌లైతే.. ప‌రిస్థితులు ఊహించేందుకు సైతం క‌ష్టంగా మార‌టం ఖాయం.

అన్నికేసుల్లో కాకున్నా.. కొన్ని సున్నిత కేసుల్లో.. కోట్లాది మంది మ‌నోభావాలు.. న‌మ్మ‌కాలు ముడిప‌డి ఉన్న అంశాల్లో సుప్రీం తొంద‌ర‌ప‌డి తీర్పులు ఇవ్వ‌టంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌న్న స‌త్యం.. తాజాగా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యంలో 10 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌ల ద‌ర్శ‌నానికి ఓకే చెబుతూ తీర్పు ఇవ్వ‌టం.. దాని త‌ద‌నంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు కేర‌ళ‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యంలో శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న న‌మ్మ‌కాన్ని బ్రేక్ చేసేలా తీర్పు ఉండ‌టం.. దీనికి వ్య‌తిరేకంగా ల‌క్ష‌లాది మ‌హిళ‌లు రోడ్ల మీద‌కు రావ‌టం.. శాంతియుత ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు చేప‌ట్ట‌టం తెలిసిందే. ఇదంతా త‌మ న‌మ్మ‌కాల‌కు.. సంప్ర‌దాయాన్ని ర‌క్షించుకోవ‌టంతో పాటు.. క్షేత్ర ప‌విత్ర‌త‌ను ర‌క్షించుకోవ‌టానికే అన్న వాద‌న‌ను వినిపించారు.

సుప్రీం తీర్పు ఇచ్చింది కాబ‌ట్టి.. దాన్ని అమ‌లు చేయాల‌న్న అత్యుత్సాహాన్ని కేర‌ళ పోలీసులు ప్ర‌ద‌ర్శించిన వైనంపై ఔరా అనిపించేలా చేసింది. ఉత్సాహం ఉండొచ్చు కానీ.. మ‌రీ ఇంత ఓవ‌రాక్ష‌నా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపించింది. ఇదిలా ఉంటే.. సుప్రీం ఇచ్చిన తీర్పును మ‌ళ్లీ పున‌రాలోచించాల‌న్న అభ్య‌ర్థన‌కు నో చెప్పిన సుప్రీం.. ఎట్ట‌కేల‌కు ఈ ఇష్యూ మీద మ‌రోసారి విచార‌ణ‌కు తాజాగా ఓకే చెప్పింది. 10 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులైన మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన తీర్పుపై మ‌రోసారి విచార‌ణ‌కు సుప్రీం తాజాగా స‌రేనంది.

ఇప్ప‌టికే ఈ ఇష్యూపై ఉన్న 19 పిటిష‌న్లు పెండింగ్‌లో ఉన్న‌ట్లు సుప్రీం పేర్కొంది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్.. ఎస్కే కౌర్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజా విచార‌ణ‌కు సానుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఈ అంశంపై విచార‌ణ‌ను ఎప్ప‌టి నుంచి స్టార్ట్ చేస్తార‌న్న అంశంపై ఈ రోజు (మంగ‌ళ‌వారం) చెప్ప‌నున్నారు. మ‌రీసారి ఎలాంటి తీర్పు సుప్రీం నుంచి వ‌స్తుందో చూడాలి.