Begin typing your search above and press return to search.

మోడీకి దిమ్మ‌తిరిగే షాక్‌: డిమానిటైజేష‌న్‌పై సుప్రీం కోర్టు విచార‌ణ‌.. ఎప్ప‌టి నుంచంటే!

By:  Tupaki Desk   |   12 Oct 2022 1:41 PM GMT
మోడీకి దిమ్మ‌తిరిగే షాక్‌: డిమానిటైజేష‌న్‌పై సుప్రీం కోర్టు విచార‌ణ‌.. ఎప్ప‌టి నుంచంటే!
X
పెద్ద నోట్ల రద్దు విష‌యంలో నరేంద్ర మోడీకి సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబరు 9న విచారణ జరుపుతామని తెలిపింది.

అంతేకాదు.. దీనిని విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యంగా త‌ప్పించుకునే అవ‌కాశం కూడా లేద‌ని.. సుప్రీం తేల్చి చెప్ప‌డంమ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలోనే నోట్ల రద్దు అంశంపై కేంద్రం, రిజర్వు బ్యాంకుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షలో ఉన్న "లక్ష్మణరేఖ" గురించి తమకు తెలుసని, అయితే ఈ సమస్య కేవలం "అప్రస్తుత" అంశంగా మారిందో లేదో అనే విషయాన్ని నిర్ణయించడానికి 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది.

"రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఏదైనా సమస్య వస్తే.. దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇరుపక్షాలు అంగీకారానికి రావడం లేదు కాబట్టి.. ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సమస్య 'అప్రస్తుతం'గా మారిందా, న్యాయసమీక్ష పరిధిలో లేదా అనే అంశాలను సమీక్షించాలి. మాకు లక్ష్మణ రేఖ ఎక్కడ ఉంటుందో తెలుసు. కానీ, ఇది ఎలా చేశారనే విషయాన్ని పరిశీలించాలి. న్యాయవాదు ల వాదనలు వినాలి" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. వాస్తవానికి సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించ‌డం.. ఇదే తొలిసారి అని న్యాయ వాదులు అంటున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది.?

2016 నవంబరు 8న రాత్రికి రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించి తీవ్ర సంచ‌ల‌నం రేపారు. అప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రికీ ఈ విష‌యం క‌నీసం.. తెలియదు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇంకేముంది.. దేశ‌వ్యాప్తంగా గ‌గ్గోలు పుట్టింది. అప్ప‌టి కే ఉన్న పాత‌నోట్ల‌ను మార్చుకుని.. కొత్త నోట్లు తీసుకునేందుకు కూడా.. కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే గ‌డువు ఇచ్చారు. పాత నోట్లు ఉన్న వారిపై క్రిమిన‌ల్ నేరాల కింద అరెస్టు చేయాల‌ని ఆదేశించారు.

అయితే.. దీనివ‌ల్ల అనేక ప‌రిశ్ర‌మ‌లు.. ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌ని ప‌రిశ్ర‌మాధిప‌తులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే మోడీ నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సెప్టెంబరు 28న విచారణ జరిగింది. అటార్నీ జనరల్ ఆర్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయిందని అన్నారు.

అయితే.. సీనియర్ అడ్వకేట్లు పి చిదంబరం, శ్యామ్ దివాన్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తుకు కూడా సంబంధించినదని పేర్కొన్నారు.

పిటిషనర్ వివేక్ నారాయణ్ శర్మ తరపు సీనియర్ న్యాయవాది ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచాలని పేర్కొన్నారు. "ధర్మాసన సమయం వృథా" అనే పదాలు తనను ఆశ్చర్యపరిచాయని సీనియర్ న్యాయవాది వాదించారు. సీనియర్ న్యాయవాది పి చిదంబరం మాట్లాడుతూ.. "ఈ సమస్య అకడమిక్‌గా మారలేదని, ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలని అన్నారు.

కాగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.