Begin typing your search above and press return to search.

సీబీఐ-ఈడీలపై సుప్రీంకు ఎందుకంత ఆగ్రహం?

By:  Tupaki Desk   |   26 Aug 2021 3:56 AM GMT
సీబీఐ-ఈడీలపై సుప్రీంకు ఎందుకంత ఆగ్రహం?
X
రాజకీయాల్లోకి అసలుసిసలు ప్రజాప్రతినిధులు రావడం లేదు. నేరాలు, ఘోరాలు చేసిన వారు,సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నవారు వస్తున్నారు.. అందలం ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే నేరమయ రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుకాబోతోందా..? నేరచరిత కలిగి ఉన్న నేతలంతా తప్పుకునే పరిస్థితి రాబోతోందా..? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు వీటికి బలాన్ని చేకూర్చుతున్నాయి. క్రిమినల్‌ కేసులతోపాటు మనీ ల్యాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసులు త్వరగా తీర్చాలని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లో భయం మొదలైంది.

సామాన్యులపై ఒకలా.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులపై మరోలా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయా? వ్యాపారులు, సీనీ ప్రముఖులు, వ్యతిరేకులపై గట్టిగా పనిచేసే సీబీఐ, ఈడీలు.. ఎంపీ, ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఎందకంత ఏళ్లకు ఏళ్ల జాప్యం చేస్తున్నాయా? అధికారంలో ఉండే వారికి బెల్లంలా ఎందుకు పనిచేస్తున్నాయి? ఈ పక్షపాత ధోరణిని తాజాగా సుప్రీంకోర్టు కడిగేసింది. చట్టసభ సభ్యుల విషయంలో సీబీఐ, ఈడీ దర్యాప్తులో జాప్యం చేస్తున్న తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది.

దారుణం విషయం ఏంటంటే ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలు అవుతున్నా కూడా చార్జీషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని సీబీఐ-ఈడీని సుప్రీంకోర్టు నిలదీసిన పరిస్తితి నెలకొంది.ఈడీ కేవలం ఆస్తులను జప్తు చేయడం మినహా ఇంకేమీ చేయడం లేదని ఆక్షేపించింది.

పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను ఆదేశించారు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల్లో దర్ాయప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ఆయన ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్లు అయినా చార్జీషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని.. చార్జీషీట్లను దాఖలు చేయాలని ఆదేశించారు.

దేశంలో ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ ఏళ్ల తరబడిగా సాగుతుండడం, కోర్టుల్లో భారీగా పోగుపడి ఉండడంతో.. సుప్రీం దీనికి చెక్ పెట్టాలని భావించింది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. దేశంలో 4,859 కేసులు తెలంగాణలో 143కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం.

శిక్షపడ్డ నేరచరితులైన ప్రజాప్రతినిధులను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే డిమాండ్ ఉంది. 2016లో దాఖలైన పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకొని అప్పట్లోనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒకవేళ ఇదే జరిగితే చాలా మంది సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.