Begin typing your search above and press return to search.

మాల్యా మైండ్ బ్లాంక‌య్యే తీర్పిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   8 Dec 2018 4:57 PM IST
మాల్యా మైండ్ బ్లాంక‌య్యే తీర్పిచ్చిన సుప్రీం
X
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. పలు బ్యాంకుల కు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్న మాల్యా ప్రస్తుతం లండన్‌ లో ఉన్నాడు. వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం. దీని పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు ఈ నెల పదో తేదీన తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో మాల్యా కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యం లో భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరుశాతం ప్రజాధనాన్ని తిరిగి చెల్లిస్తానంటూ ఇటీవల పలు ట్వీట్ల లో మాల్యా ప్రకటించారు.అంతేకాకుండా, తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థున్ని కాదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో విజయ్‌ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది.

తన పై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నాడు. రెండున్నరేళ్ల‌ క్రితం ఈ లిక్కర్ వ్యాపారి లండన్‌కు చెక్కేసిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి గత రెండు రోజులుగా అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలనే చేస్తున్న మాల్యా.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని వేడుకున్నాడు. ఈ కేసును సుప్రీం విచారణకు స్వీకరించి త‌న తీర్పు వెలువ‌రించింది. పరారీ లో ఉన్న ఆర్థిక నేరగాడి గా ప్రకటించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రారంభించిన విచారణ ప్రక్రియ పై స్టే విధించ‌బోమ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. మాల్యా పిటిషన్‌ పై వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

కాగా, అంత‌ర్జాతీయం గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ తో మాల్యా జాగ్ర‌త్త ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ ఒప్పందంలో జరిగిన అవకతవకల పై క్రిస్టియన్ మైకెల్‌ను భారత్‌ కు రప్పించిన నేప‌థ్యంలో ఓవైపు మరో వైపు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ- మెహుల్ చోక్సీలను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేప‌థ్యంలోనే మాల్యా కాళ్ల‌బేరానికి వ‌స్తున్నారు. బ్యాంకుల వద్ద తీసుకున్న ప్రజల సొమ్మును 100 శాతం తిరిగి బ్యాంకులకు చెల్లించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా భారత్ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేశారు. మాల్యాను భారత్‌ కు అప్పగించేదాని పై బ్రిటన్ కోర్టు త్వరలో తీసుకోనున్న నిర్ణయానికి ముందే మాల్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం విశేషం.