Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ ఎపిసోడ్ లో సుప్రీం ఏం చెప్పిందో జాగ్రత్తగా గమనించారా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 6:30 AM GMT
నిమ్మగడ్డ ఎపిసోడ్ లో సుప్రీం ఏం చెప్పిందో జాగ్రత్తగా గమనించారా?
X
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి నియమిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందే. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నో చెప్పిన విషయం పాతదే. అదే సమయంలో కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఏ బాబ్డే.. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న.. జస్టిస్ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారంటూ నిలదీసింది. దురుద్దేశ చర్యగా అభివర్ణించిన సుప్రీంకోర్టు.. ఆర్డినెన్సు ఉద్దేశాలతో తాము సంతృప్తి చెందలేదని చెప్పటంతో పాటు.. ఇలాంటి ఆర్డినెన్సులను ఎలా ఆమోదిస్తారని కూడా ప్రశ్నించింది.

ఇదంతా చేసిన సుప్రీంకోర్టు.. ఏపీ సర్కారు కోరినట్లు స్టే ఇవ్వలేదు. అదే సమయంలోనూ నిమ్మగడ్డ తిరిగి పదవి చేపట్టేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించమన్న ఆదేశాల్ని కూడా ఇవ్వలేదన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలన్న అత్యున్నత న్యాయస్థానం.. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులుజారీ చేయలేమని పేర్కొనటం గమనార్హం.

సుప్రీం తాజా వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. అటు ఏపీ సర్కారుకు కానీ.. ఇటు నిమ్మగడ్డకు కానీ సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నది మర్చిపోకూడదు. కానీ..ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ అంటూ హడావుడి చేస్తున్న మీడియా సంస్థలు.. సుప్రీం నిర్ణయాన్నిపూర్తిస్థాయిలో హైలెట్ చేయకపోవటం గమనార్హం. ఏపీ సర్కారు చర్య సరికాదని చెబుతూనే.. హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయాలని చెప్పలేదన్న కీలక పాయింట్ ను చాలా మీడియా సంస్థలు మిస్ చేయటం ఏమిటి?