Begin typing your search above and press return to search.

అయ్య‌ప్ప ద‌గ్గ‌రికి అతివ‌ల‌కు ప్ర‌వేశం లేదా?

By:  Tupaki Desk   |   11 Jan 2016 11:06 PM IST
అయ్య‌ప్ప ద‌గ్గ‌రికి అతివ‌ల‌కు ప్ర‌వేశం లేదా?
X
సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా క‌న్నుల పండువ‌గా జ‌రిగే మ‌క‌ర‌విల‌క్కు సంద‌ర్భంగా భ‌క్తుల దృష్టిని ఆక‌ర్షించాల్సిన శబరిమల అయ్య‌ప్పస్వామి ఆల‌యం కోర్టు కేసు మూలంగా తెర‌మీద‌కు వ‌చ్చింది. కుమార‌స్వామి ఆలయంలోకి మహిళాభక్తులను అనుమతించకూడ‌ద‌ని ఆలయ నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఏళ్ల క్రిత‌మే నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యంపై భిన్న‌భిప్రాయాలు వెలువ‌డ‌గా...ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అప్పుడే కేరళ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు ఆలయప్రవేశం లేదన్న ఆల‌య బోర్డు నిషేధం స‌రైన‌దేన‌ని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై యంగ్ ఇండియ‌న్స్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తాజాగా ఈ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. బోర్డు నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. 'ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించడంలేదు? అనుమతి ఇస్తారా? లేదా?వెంట‌నే తేల్చిచెప్పండి' అంటూ సుప్రీం కోర్టు అయ్య‌ప్ప‌దేవాల‌యం బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేయాలని కోర్టు స్ప‌ష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదావేసింది.