Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన సునీల్ కుటుంబ సభ్యుల వీడియోలు

By:  Tupaki Desk   |   11 Aug 2021 7:36 AM GMT
సంచలనంగా మారిన సునీల్ కుటుంబ సభ్యుల వీడియోలు
X
దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న సునీల్ పై తప్పుడు కేసు నమోదు చేశారని.. ఆయన్ను ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్ సతీమణి. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి. తమకు కోట్లకు కోట్లు ఉన్నాయని అంటున్నారని.. అవే ఉంటే.. డెంగీ ఫీవర్ వస్తే బంగారాన్ని బ్యాంకులో పెట్టి వైద్యం చేయించి.. బతికించుకున్నట్లు చెప్పారు.

సీబీఐ వాళ్లు అమ్ముడుబోయారని.. అమాయకులను హింసించి.. హత్య చేసినట్లు ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. తమ పెళ్లైనప్పటి నుంచి విచారణ.. విచారణ.. అంటూ వేధిస్తూనే ఉన్నారని.. రెండేళ్లుగా విచారణ చేస్తూనే ఉన్నారన్నారు. వైఎస్ వివేకానంద కుమార్తె పదిహేను మంది పేర్లను చెబితే.. అందులో ఒక్కరిని కూడా ఇప్పటివరకు విచారణకు సీబీఐ వాళ్లు పిలవలేదన్నారు. సీబీఐ వాళ్లు కూడా డబ్బులకు అమ్ముడుబోయారన్న సునీల్ సతీమణి.. మీడియాతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె చేసిన ఆరోపణల్లో ముఖ్యమైనవి చూస్తే..

- కోట్లున్నాయ్.. కోట్లున్నాయ్ అంటారు. ఎక్కడ కోట్లు ఉన్నాయి సార్? కోట్లు ఉంటే మేం ఇలా ఎందుకు ఉంటాము? కోట్లు ఉంటే మేం ఎందుకు పని చేస్తాం. మా ఆయనకు డెంగీ ఫీవర్ వస్తే చూపించుకోవటానికి డబ్బుల్లేవు. బ్యాంకులో బంగారాన్ని పెట్టుకొని మా ఆయన్ను బతికించుకున్నాను. అలాంటి మా దగ్గరకు కోట్లు ఎలా వచ్చాయి?

- కేసు పెద్దోళ్ల మీదకు వస్తుందని సీబీఐ వాళ్లను మా మీదకు ఉసిగొలిపారు. సీబీఐ వాళ్లు కూడా డబ్బులకు అమ్ముడుబోయారు. ఇది వాస్తవం. లేకుంటే మా ఆయన్నే ఎందుకు హింసిస్తున్నారు. సునీతమ్మ పదిహేను మంది పేర్లు చెప్పింది. వాళ్లను తీసుకెళ్లి విచారించొచ్చు కదా? మా ఆయన్నే ఎందుకు? వాళ్లల్లో ఒక్కరిని సీబీఐ వాళ్లు విచారించలేదు.
- సీబీఐ వాళ్లకు దమ్ము.. ధైర్యం ఉంటే నిజమైన హంతకుల్నిపట్టుకోవాలి. మాలాంటి అమాయకుల్ని పట్టుకొని హింసించకూడదు. వాళ్లకు చంపిన వాళ్లు ఎవరో తెలుసు. మీకు (మీడియా) తెలుసు. మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు సీబీఐవాళ్లు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని మా మామను.. మరిదిని కొడుతున్నారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు వాతలు పడి ఇంటికి వస్తే మా మామకు మా అత్తమ్మ ఆయింట్ మెంట్ పూసేది సార్.

- ఢిల్లీకి వెళ్లి సాయంత్రానికే వస్తారని పోలీసు సార్ చెప్పారు. ఊరికనే సంతకం పెట్టి రావటమేనని చెప్పారు. కానీ.. రాలేదు. 2 నెలల 25 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. సీబీఐ వాళ్లు రోజూ కొడుతూనే ఉండేవారట సార్. అది చెప్పు.. ఇది చెప్పు.. ఒప్పుకో అని వేధించేవారు. చంపేస్తాం.. మీ నాన్నను కొడతాం.. మీ అమ్మను కొడతామని కొట్టేవారు. చాలా హింసించేవారు. మా ఆయనిది చిన్న వయసు. ఒళ్లంతా నొప్పులు.. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.