Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్ కు తోడు జీవీఎల్..సుజనా ఇక నోరెత్తలేరు

By:  Tupaki Desk   |   30 Dec 2019 1:17 PM GMT
సీఎం రమేశ్ కు తోడు జీవీఎల్..సుజనా ఇక నోరెత్తలేరు
X
ఏపీ రాజధానిపై జరుగుతున్న రచ్చలోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి నిన్నటిదాకా ఓ రేంజిలో వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి కుదరదని - అందుకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తే... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చూస్తూ ఊరుకోదని జగన్ సర్కారుకు ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. అయితే సుజనా నోటి నుంచి ఈ మాటలు వెలువడి 24 గంటలు కూడా గడవకముందే.. సుజనా ఇకపై సైలెన్స్ మంత్రాన్ని జపించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని - ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఏకంగా బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు చెప్పిన నేపథ్యంలో నిజంగానే సుజనా ఇకపై నోరు పెగిల్చే అవకాశాలే లేవన్న వాదన వినిపించింది.

ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వైఖరి పట్ల క్రమంగా స్పష్టత వచ్చేసినట్టేనని చెప్పక తప్పదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించగా - తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా సరిగ్గా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించలేదని - రాజధాని మార్చాలని కూడా కేంద్రం చెప్పదని అన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే కేంద్రం సూచనలు చేస్తుందని వెల్లడించారు. ఇది తమ జాతీయ పార్టీ విధానమని వివరించారు. అసలు, రాజధానిపై ఏ పార్టీలోనూ ఏకాభిప్రాయం లేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే జీవీఎల్ కంటే కాస్తంత ముందుగా బీజేపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు - సుజనాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీఎం రమేశ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించారు.

అంటే... తన పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు... ఏపీ రాజధాని వ్యవహారంతో అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో... వారి వాదనను వ్యతిరేకిస్తూ సుజనా రాజదానిని అమరావతిలోనే కొనసాగించాలని సుజనా మరోమారు గళం వినిపించలేరు కదా. అంటే... బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు రాజధానిపై తమ పార్టీ స్టాండ్ ఇదేనంటూ అభిప్రాయపడిన వేళ... సుజనా గళం మూగబోక తప్పదన్న మాటేగా. సో... రాజధానిపై ఇకపై సుజనా ఏమీ మాట్లాడటానికి అవకాశం లేదన్న మాట.