Begin typing your search above and press return to search.

స్వామిని చంపేయాలనుకున్నారట

By:  Tupaki Desk   |   8 Aug 2016 4:57 AM GMT
స్వామిని చంపేయాలనుకున్నారట
X
సంచలన వ్యాఖ్యల నేత సుబ్రమణ్య స్వామి తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నా.. గాంధీ కటుంబం అన్నా ఆయన అంతెత్తు ఎగిరి పడుతుంటారు. గాంధీ ఫ్యామిలీపై పంచ్ లు విసిరేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం ప్రదర్శించే ఆయన కారణంగా గాంధీ ఫ్యామిలీ ఎన్ని చిక్కుల్లో చిక్కుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ ప్యామిలీని అవినీతి మరక అంటించిన భోఫోర్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది సుబ్రమణ్య స్వామి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. తిరుగులేని విధంగా సాగుతున్న యూపీఏ సర్కారు పరపతిని భారీగా దెబ్బ తీసిన 2జీ స్కాంను తెర మీదకు తీసుకొచ్చింది సుబ్రమణ్య స్వామే.

కాంగ్రెస్ మీదా.. గాంధీ కుటుంబం మీద ఆయన పగబట్టినట్లుగా వ్యవహరిస్తారు? అందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అన్న సందేహాన్ని పలువురు తరచూ వ్యక్తం చేస్తుంటారు. ఎప్పుడూ ఆ విషయానికి సమాదానం దొరికేలా వ్యాఖ్యానించని సుబ్రమణ్య స్వామి తాజాగా మాత్రం అసలు విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.

దేశంలో ఎమర్జెన్సీని విధించిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని.. ఆ సమయంలో తన ప్రాణాలు తీయాలని రెండుసార్లు ప్రయత్నం జరిగిందని స్వామి ఆరోపించారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆదేశాల మేరకే ఆ ప్రయత్నం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని మాటలు చెబుతున్నారు. దీనికి ఆధారం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు.. ఆ విషయం అప్పట్లో పేపర్లలో వచ్చిందని స్వామి చెప్పారు. విరాట్ హిందూస్థాన్ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో తాజా సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి.. గాంధీ ప్యామిలీ అంటే తనకెందుకంత ఒళ్లు మంటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన ప్రాణాలు తీయాలనుకున్న సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ బీజేపీలో ఉండగా.. సంజయ్ కుమారుడు వరుణ్ గాంధీ కూడా బీజేపీ నుంచే నేతృత్వం వహించటం విశేషం. స్వామి తాజా వ్యాఖ్యలపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.