Begin typing your search above and press return to search.

హిజాబ్ వివాదం: కర్ణాటక హైకోర్టు సంచలన ఉత్తర్వులు

By:  Tupaki Desk   |   10 Feb 2022 2:30 PM GMT
హిజాబ్ వివాదం: కర్ణాటక హైకోర్టు సంచలన ఉత్తర్వులు
X
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్ పై ఎవరినీ బలవంతం చేయవద్దన్న న్యాయస్థానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని తీర్పు వచ్చేవరకూ క్లాస్ రూంలలో విద్యార్థులు హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది.

కాగా ముస్లిం యువతులు పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టుకు ఎక్కింది. ఇదే అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.

ఇటీవలే ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1న ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబ్ వివాదం మరింత పెరిగింది. చాలా మంది ముస్లిం మహిళలు హిజాబ్ కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?
హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని 'హిజాబ్ ' అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.

ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై ఈనెల 10న విచారణ చేపట్టారు. ఇంతలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె విద్యాశాఖ, న్యాయశాఖతో సంప్రదింపులు జరిపి శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వలు జారీ చేశారు. అయితే అటు రాజకీయ పార్టీల మధ్య రగడ మొదలైంది. హిజాబ్ ధరిస్తే 'తాలిబనైజేషన్' ను ప్రోత్సహించినట్లవుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్ ఎస్ఎస్ పై మండిపడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రభుత్వం కావాలనే చేస్తోందన్నారు. అయితే హెచ్ డీ కుమారస్వామి మాత్రం ఇప్పటి వరకు అనుమతించిన ప్రదేశాల్లో హిజాబ్ కు అనుమతివ్వండి.. కొత్తగా ప్రవేశపెట్టిన చోటల నిషేధించండి.. అని అన్నారు.