Begin typing your search above and press return to search.

పావురాల కలకలం.. మొన్న ఒడిశా.. నేడు ఏపీ

By:  Tupaki Desk   |   5 Jan 2022 11:30 AM GMT
పావురాల కలకలం.. మొన్న ఒడిశా.. నేడు ఏపీ
X
పక్షులు విహరిస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. అయితే వారు మాత్రం భయపడుతున్నారు. ఆ పావురాలను చూసి హడలిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయంటూ పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. అవి సాధారణ పక్షుల్లాగా విహరిస్తే ఏం కాదు. కానీ అనుమానాస్పదనంగా కాళ్లకు ట్యాగ్ లతో ఆ పావురాలు దర్శనం ఇస్తున్నాయి. వాటిపై కొన్నింట్లో చైనా భాష ఉండడం గమనార్హం. అయితే ఈ పావురాలు మొన్న ఒడిశాలో కొన్ని దర్శనమివ్వగా నేడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించాయి. వీటిని చూసిన స్థానికులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో అనుమానాస్పదంగా ఓ పావురం ఆందోళనలు కలిగిస్తోంది. జిల్లాలోని చీకుమర్తిలో ఓ అపార్టుమెంటులో ఈ పావురాన్ని గుర్తించారు. అంతేకాకుండా ఆ పక్షి కాలికి పసుపుపచ్చని ట్యాగ్ వారిలో భయాన్ని కలిగిస్తోంది. చైనా భాషతో కూడిన కోడ్ ఆ ట్యాగ్ లోఉంది. తెలుపు రంగు రెక్కలు, బూడిదరంగును కలిగిఉన్న పావురం కుడి కాలికి ఈ ట్యాగ్ ని తగిలించారు.

ట్యాగులో ఎగురుతున్న ఓ పక్షి బొమ్మతో పాటు AIR 2207 అనే నంబర్ ఉంది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద పావురంపై సమాచారం అందినవెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఎక్కడినుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక ఇది చైనాకు సంబంధించిన పక్షి అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఆ పక్షిని ఎందుకు పంపించారు అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల ఒడిశాలో కూడా వివిధ ప్రాంతాల్లో పావురాలు కనిపించాయి. ఇలాగే ట్యాగులతో కూడిన పక్షులు దర్శనమిచ్చాయి. మంగళవారం నాడు ఆ రాష్ట్రంలోని సుందర్ గఢ్ రాజ్ గంగ్ పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పావురం కలకలం రేపింది. వీటితో పాటు మరికొన్ని చోట్ల కూడా ట్యాగులతో కూడిన పావురాలు కనిపించాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? దీనికి గూఢచర్యం కోసం వినియోగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముమ్మరంగా సమాచారం సేకరిస్తున్నారు.