Begin typing your search above and press return to search.

ఎంపీ నవనీత్‌ కౌర్‌ కి ఊరట... హైకోర్టు తీర్పుపై స్టే !

By:  Tupaki Desk   |   22 Jun 2021 2:30 PM GMT
ఎంపీ నవనీత్‌ కౌర్‌ కి ఊరట...  హైకోర్టు తీర్పుపై స్టే !
X
ప్రముఖ సినీ నటి , మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎంపీ అయినటువంటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె గత ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణల పై గత కొన్ని రోజుల క్రితం విచారణ జరిపిన బాంబే హైకోర్టు, నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తీర్పు వెల్లడించింది. అయితే , బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

అలాగే , ఫిర్యాదుదారుకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. అయితే, నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, ఆమె ఎస్సీ కాదని శివసేన నేతలు కోర్టు తలుపు తట్టారు. దీనిపై బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ విచారణ జరిపి, నవనీత్ కౌర్ మోసపూరితమైన రీతిలో కల్పిత పత్రాలను సమర్పించినట్టు అభిప్రాయపడింది. ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. జస్టిస్‌ వినీత్‌ సరన్‌, దినేష్‌ మహేశ్వరిల వేకేషన్‌ బెంచ్‌ నవనీత్‌ కౌర్‌ పిటిషన్‌పై విచారణ జరిపి మంగళవారం స్టే విధించింది.