Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ గూటికి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి.. క్లారిటీ ఇచ్చిన చెరుకు?

By:  Tupaki Desk   |   3 Nov 2020 10:30 AM GMT
టీఆర్ఎస్ గూటికి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి.. క్లారిటీ ఇచ్చిన చెరుకు?
X
దుబ్బాక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఓ ప్రచారం తీవ్ర కలకలం రేపింది. అది నిజమో.. కాదో తెలియక ఓటర్లు అయోమయంలో పడ్డారు. ఆ ప్రభావం దుబ్బాకలో కాంగ్రెస్ పై తీవ్రంగా పడింది.

దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలబడ్డాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ నేతగానే ఎన్నికల ముందు వరకు ఉండి చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం కాంగ్రెస్ టికెట్ పై దుబ్బాకలో పోటీచేస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న ఫేక్ న్యూస్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఖంగుతిన్నారు. వెంటనే తొగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తాను ఎప్పటికీ చేరేది లేదంటూ వ్యాఖ్యానించారు.

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఓటమి భయంతో తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్యంటూ మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్‌ను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నాయని వివరించారు.