Begin typing your search above and press return to search.

ఏపీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కొత్త అడ్ర‌స్ దొరికింది

By:  Tupaki Desk   |   27 April 2016 12:32 PM GMT
ఏపీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కొత్త అడ్ర‌స్ దొరికింది
X
రాష్ట్ర విభజన తరువాత సినిమా పరిశ్రమను విశాఖపట్ట‌ణానికి తరలించాలని కొంతమంది కోరుతున్నా, అది సాధ్యంకాదని అంటున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నటీనటులు - సాంకేతిక నిపుణులు అనేకమంది చెన్నైలో ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీలో సినిమా స్టూడియో నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శ్రీసిటీకి చెందిన శ్రీనిరాజు - సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేష్‌ బాబు కలిసి శ్రీసిటీ వద్ద స్టూడియో నిర్మాణం చేపట్టే అవకాశాలున్నట్లు సమాచారం.

శ్రీ‌సిటీలోనే సినీ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు గ‌ల కార‌ణాల‌ను విశ్లేషిస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. చెన్నై నుంచి శ్రీసిటీ ప్రాంతానికి రావడానికి గంటన్నర సమయం పడుతుంది. అదేవిధంగా తిరుపతి నుంచి కానీ - రేణిగుంట విమానాశ్రయం నుంచి కానీ శ్రీసిటీకి వెళ్లడానికి గంటన్నర లోపు పడుతుంది. గతంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో అనేక షూటింగ్‌ లు జరిగిన విషయం తెలిసిందే. ఇంటింటి రామాయణం చిత్రం నుంచి జయచిత్ర నటించిన రిక్షారాజీ లాంటి సినిమాలు 1970 దశకంలో షూటింగ్‌ లు జరుపుకొన్నాయి. తరువాత చిరంజీవి నటించిన ఆలయ శిఖరం - ఖైదీ లాంటి సినిమాలు - రాజేంద్రప్రసాద్‌ నటించిన ప్రేమ తపస్సు - సీతాపతి చలో తిరుపతి - చెట్టుకింద ప్లీడర్‌ - మేడమ్‌ లాంటి సినిమాల నుంచి అన్నమయ్య లాంటి సినిమాలు కూడా ఈ ప్రాంతాల్లోనే షూటింగ్‌ లు జరుపుకున్నాయి. శేషాచలం కొండల్లోని తలకోనతో పాటు - నగరి సమీపంలోని కైలాసకోన - కుప్పం సమీపంలోని దుముకురాళ్ల లాంటి ప్రాంతాల్లోనే తెలుగు చిత్రాలే కాకుండా తమిళం - కన్నడ చిత్రాలు కూడా షూటింగ్‌ లు జరుపుకున్నాయి.

1980 నుంచి 1990 దశకం వరకు చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్‌ లు జరిగాయి. దీంతో ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు - దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వారు తిరుపతిలో స్టూడియోలు నిర్మించడానికి కూడా ముందుకు వచ్చారు. ఇప్పటికీ ఈ స్టూడియోలకు చెందిన స్థలాలు అలాగే ఉన్నాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌ వల్ల అప్పట్లో సినిమా స్టూడియోల నిర్మాణాలను ఆపేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు - సత్యవేడు - తడ ప్రాంతాలవద్ద అందమైన బీచ్‌ లు ఉన్నాయి. తడ ప్రాంతంలో కోనసీమను తలదన్నే విదంగా అనేక సుందరమైన నీటి ప్రవాహ ప్రాంతాలుండ‌టం కూడా క‌లిసి వ‌చ్చే అంశంగా చెప్తున్నారు.

విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణాలు చేపట్టడం కంటే అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతంగా చిత్తూరు - నెల్లూరు జిల్లాలు ఉప‌యుక్తంగా ఉంటాయని చెప్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఉంది. సినిమా పరిశ్రమను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం వల్ల సినీ పరిశ్రమకు మేలు చేసిన వారవుతారని అంటున్నారు. శ్రీసిటీలో సినీ స్టూడియో ఏర్పడితే - అది టాలీవుడ్‌ - కోలివుడ్‌ లకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.