Begin typing your search above and press return to search.

ఆ భూముల్ని ఫ్రీగా ఇచ్చేస్తానంటున్న బాలయ్య అల్లుడు

By:  Tupaki Desk   |   18 Dec 2019 10:45 AM GMT
ఆ భూముల్ని ఫ్రీగా ఇచ్చేస్తానంటున్న బాలయ్య అల్లుడు
X
ఏపీ రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలయ్య అల్లుడు.. విశాఖ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిన భరత్ తాజాగా రియాక్ట్ అయ్యారు. రాజధాని విషయంలో దక్షిణాఫ్రికాకు.. ఏపీకి లింకేమిటని ప్రశ్నించారు. అసలు ఆ పోలికే సరికాదన్నారు.

రాజధాని ప్రాంతంలో తనకు 500 ఎకరాలు ఉన్నాయంటూ చేస్తున్న వాదనలు నిజం లేదన్నారు. తన మీద వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని.. ఒకవేళ తనకు భూములు ఉన్నట్లు చూపిస్తే.. వారికి ఆ భూముల్ని ఫ్రీగా ఇచ్చేస్తానంటూ సవాలు విసిరారు. గతంలోనూ తాను ఇదే మాట అంటే ఎవరూ నిరూపించలేదని.. ఇప్పుడూ తాను గతంలో అన్న మాట మీదనే నిలుస్తానని వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతి కోసం అక్కడి రైతులు 35వేల ఎకరాల భూమిని ఇచ్చారని.. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వచ్చారని.. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాలో రాజకీయ అవసరాల కోసం మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేశారని చెప్పారు.

దక్షిణాఫ్రికా గురించి మాట్లాడేటప్పుడు అక్కడి డెవలప్ మెంట్ ఎలా ఉందో కూడా గమనించి మాట్లాడాలన్నారు. ఓపక్క టీడీపీ సీనియర్ నేతలు.. అందునా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కేఈ.. గంటా లాంటివాళ్లు జగన్ రాజధాని ప్రకటనను స్వాగతిస్తుంటే.. భరత్ అందుకు భిన్నంగా వ్యాఖ్యానించటం గమనార్హం.