Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్ పై బంతితో దాడి

By:  Tupaki Desk   |   27 Aug 2021 1:30 AM GMT
ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్ పై బంతితో దాడి
X
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లండ్ అభిమానులు హద్దులు దాటారు. భారత పేస్ బౌలర్ సిరాజ్ పై బంతులు విసిరారు. అతడిని గేలి చేశారు. ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్ కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత ఆటగాళ్లను మైదానంలో టార్గెట్ చేసుకొని దాడులకు దిగడం విస్మయానికి గురిచేస్తోంది.

రెండో టెస్ట్ సందర్భంగా కేఎల్ రాహుల్ పై వాటర్ బాటిల్ మూతలను విసిరిన ఘటన మరవకముందే మూడో టెస్ట్ తొలి రోజు సిరాజ్ ను లక్ష్యంగా చేసుకొని ఓ ఇంగ్లండ్ అభిమాని బంతిని విసిరాడు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతిని తిరిగి వారివైపే విసరాలని సిరాజ్ కు సైగ చేశాడు.

సిరాజ్ పై ఇంగ్లండ్ అభిమానులు దాడి చేశారని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక సిరాజ్ పై బంతితో దాడి చేసిన ఆ ఇంగ్లండ్ అభిమాని అంతటితో ఆగకుండా ఇండియా స్కోర్ ఎంత అంటూ సిరాజ్ ను గేలి చేసే ప్రయత్నం చేశాడు.

దీనికి సిరాజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆ వ్యక్తికి 1-0 అని సైగ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సిరీస్ లో టీమిండియా ఆధిక్యాన్ని సూచిస్తూ సిరాజ్ చేసిన సంజ్ఞలతో ఆ ఇంగ్లండ్ అభిమానికి రివర్స్ పంచ్ పడినట్టైంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. రెండో రోజైన గురువారం 214/2తో ఆడుతోంది. క్రీజులో జోరూట్ తోపాటు డేవిడ్ మలాన్ ఉన్నారు. చూస్తుంటే ఇండియా ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని పెట్టేలా కనిపిస్తోంది.