Begin typing your search above and press return to search.

మరో విభజన హామీకి మంగళం.. నియోజకవర్గాల పెంపు కూడా హుళ్లక్కేనట

By:  Tupaki Desk   |   3 Aug 2021 10:42 AM GMT
మరో విభజన హామీకి మంగళం.. నియోజకవర్గాల పెంపు కూడా హుళ్లక్కేనట
X
తెలుగు రాష్ట్రాలకు చెందినోళ్లంటేనే కేంద్రానికి చులకనా? వారికి సంబంధించిన అంశాలపై ఏదీ సరైన పద్దతిలో చేయటం మోడీ సర్కారుకు ఇష్టం ఉండదా? రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటిపోతున్నా.. నేటికి విభజన హామీలు అమలు కాని పరిస్థితి. విభజన చట్టం ఆమోదం పొందే వేళ.. దేశ ప్రధాని స్వయంగా ఇచ్చిన ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసిన వైనం ఒక్కటి చాలు..ఏపీ విషయంలో కేంద్రానికి ఉన్న కమిట్ మెంట్ ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఒక్క విభజన హామీ మాత్రమే కాదు.. విశాఖకు రైల్వే జోన్ కానీ.. ప్రఖ్యాత విద్యా సంస్థలు కావొచ్చు.. రాజధాని విషయంలో కావొచ్చు కేంద్రం అనుసరించిన విధానాలు ఏపీకి నష్టం కలిగేలా చేశాయే తప్పించి.. లాభం కలిగించే నిర్ణయాలు మీద ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకున్నది లేదు.

ఆ మాటకు వస్తే ఏపీ విషయంలోనే కాదు.. తెలంగాణ విషయంలోనూ ఇలాంటి వైఖరినే ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు. విభజన చట్టం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవచ్చన్న హామీ ఉంది. దాని గురించి ఆప్డేట్ ఏమిటన్న ప్రశ్నను సంధిస్తే.. ఎలాంటి మొహమాటం లేకుండా కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి అధ్యయనం చేస్తామే తప్పించి.. అమలు చేస్తామని చెప్పలేదుగా అంటూ షాకిచ్చింది.

ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు అనుకున్న దాని ప్రకారం వీటిసంఖ్యను ఏపీలో 225కు.. తెలంగాణలో 153కు పెంచాలని భావించారు. అయితే.. దీనికి సంబంధించిన అవకాశాలు ఏం ఉన్నాయో చూసేందుకు అధ్యయనం చేయాలన్న లింకు పెట్టారు. ఇప్పుడు మోడీ సర్కారు వాదన ఏమంటే.. విభజన చట్టంలో తప్పనిసరిగా హామీల్ని అమలు చేయాలన్న రూలేమీ లేదన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. కేంద్ర హోం వాఖ

ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల పెంపుపై కేంద్ర నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ స్థానాల పెంపు పరిశీలన చేయాలని ఉంది కానీ.. కచ్ఛితంగా పెంచాలన్న విషయాన్ని పొందుపర్చలేదని బదులిచ్చారు. దీంతో.. హోదా మాత్రమే కాదు.. తాజాగా జరిగే ఉప ఎన్నికల్లో సీట్ల పెంపు సైతం తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి మిగిలినట్లైంది. సీట్ల సంఖ్య పెంచితే రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సవరించాల్సి ఉన్నందున.. అక్కడి వరకు ఎందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేంద్రం ఆగిపోయినట్లుగా చెబుతున్నారు.

నియోజకవర్గాల పెంపు అంశం రాజకీయంగా మైలేజీ తెచ్చేదే. కానీ.. దాని ఫలాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఉద్దేశమే.. తాజాగా నో చెప్పటానికి కారణమంటున్నారు. గతంలో నియోజవకర్గాల పునర్విభజన వేళ అసెంబ్లీ సీట్లను 2026 వరకు పెంచాలన్న డిమాండ్ ఉంది.గతంలోని ప్రభుత్వాలు ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటే అందుకు రాజ్యాంగంలో మార్పు తప్పనిసరి అన్న క్లాజ్ పెట్టారు. ఇప్పుడు మార్పులు చేయకుండా ఉండేందుకు అదో అస్త్రంగా మారింది. ఈ లెక్కన చూస్తే.. 2026 వరకు సీట్ల సంఖ్యను పెంచటమే ఉండదు. ఇలా రాని వరాలు రాకుండా పోవటం ఒక ఎత్తు అయితే.. వరాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వకుండా ఏదో ఒకటి చెబుతూ కాలం గడపటం మరో ఎత్తు. ఏమైనా.. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న వారికి భారీ నిరాశ తప్పదని చెప్పక తప్పదు.