Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు షాకిచ్చిన స్పీక‌ర్ ఆఫీస్ సిబ్బంది

By:  Tupaki Desk   |   6 April 2018 9:51 AM GMT
త‌మ్ముళ్ల‌కు షాకిచ్చిన స్పీక‌ర్ ఆఫీస్ సిబ్బంది
X
తెలుగు త‌మ్ముళ్ల‌కు సినిమాటిక్ షాకిచ్చారు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కార్యాల‌య సిబ్బంది. హోదా ఇవ్వ‌ని వైనంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండానే శుక్ర‌వారం స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. దీంతో.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్ర‌ధాని మోడీ ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

తెలుగు త‌మ్ముళ్ల నిర‌స‌న‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని మోడీ.. వారి వంక కూడా చూడ‌లేదు. త‌న దారిన తాను వెళ్లిపోయారు. అనంత‌రం లోక్ స‌భ‌లోనే ఉండిపోయిన తెలుగుదేశం ఎంపీలు త‌మ నిర‌స‌ను కంటిన్యూ చేశారు. ఇదే విధానాన్ని గురువారం అమ‌లు చేయ‌టం.. ఎంపీలు బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు లోక్ స‌భ కార్యాల‌య సిబ్బంది కిందామీదా ప‌డాల్సి వ‌చ్చింది.

నిన్న‌టి త‌ర‌హాలోనే మెరుపు ధ‌ర్నాను మొద‌లు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీల‌కు స్పీక‌ర్ కార్యాల‌య సిబ్బంది ఊహించ‌ని రీతిలో షాకిచ్చింది. ప్ర‌ధాని కుర్చీ ఎదుట బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్న టీడీపీ ఎంపీల వ‌ద్ద‌కు వ‌చ్చిన సెక్యురిటీ సిబ్బంది.. స్పీక‌ర్ పిలుస్తున్న‌ట్లు గా చెప్పారు.

దీంతో.. ఎంపీలు త‌మ ఆందోళ‌న‌ను వ‌దిలిపెట్టి లోక్ స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఎంపీలు బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే సభ త‌లుపుల్ని మూసివేశారు. మ‌రోవైపు టీడీపీ ఎంపీలు స్పీక‌ర్ కార్యాల‌యం వ‌ద్ద‌కు రావ‌టానికి ముందే స్పీక‌ర్ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. త‌మ‌కు బురిడీ కొట్టించి.. లోక్ స‌భ నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చార‌న్న విష‌యాన్ని గుర్తించిన టీడీపీ ఎంపీలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. స్పీక‌ర్ ఛాంబ‌ర్ ముందు బైఠాయించి నిర‌స‌న‌ను చేప‌ట్టారు.