Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ బెదిరించారా..స‌ర్దిచెప్పారా?

By:  Tupaki Desk   |   4 Nov 2017 2:15 PM GMT
ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ బెదిరించారా..స‌ర్దిచెప్పారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు ఫోన్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించాల‌ని వైసీపీ నిర్ణ‌యించిన నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌కు ఫోన్ చేసి..స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని కోరారు. అయితే ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ మాట్లాడిన తీరుపై వైసీపీ నేత‌ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలకు హాజ‌రుకావాల‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌ను కోర‌గా...పార్టీ అధినేత నిర్ణ‌యం ప్ర‌కారం న‌డుచుకుంటామ‌ని వారు తెలిపిన‌ట్లు వివ‌రించారు. దీంతో వారికి నిబంధ‌న‌ల గురించి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ నిబంధ‌న‌ల గురించి స్పీక‌ర్ కోడెల వివ‌రిస్తూ... వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకపోతే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం చట్టంలో ఉందని తెలిపారు. ఈ ప‌రిణామాన్ని వైసీపీ త‌ప్పుప‌డుతోంది. ప్ర‌జాస్వామ్య‌యుతంగా స్పీక‌ర్ ఫోన్ చేయ‌డాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని...అయితే ఇలా నిబంధ‌న‌ల పేరుతో ఒత్తిడి చేయ‌డం ఏమిటని కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా... వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఫోన్ చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ..ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకముందే.. హైకోర్టు - సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని స్పీకర్ ప్ర‌శ్నించారు. న్యాయ‌స్థానం నిర్ణ‌యం కోసం తాము ఎదురుచూస్తున్నామ‌ని తెలిపారు.

కాగా, అసెంబ్లీకి గైర్హాజ‌రుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం బాధ్యతారాహిత్యమని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. పుత్తూరులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరికి నీటి సరఫరా వర్తింపజేయాలని గాలిముద్దుకృష్ణమ మంత్రిని కోరారు. పుత్తూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్ర విషయాన్ని పోలీసులు చూసుకుంటారన్నారు. మ‌రోవైపు వైసీపీ నిర్ణయాన్ని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించడం సరికాదని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.