Begin typing your search above and press return to search.

స్పేష్ స్టేషన్ అమెరికా, యూరప్ పై పడితే మా బాధ్యత కాదన్న రష్యా చీఫ్

By:  Tupaki Desk   |   26 Feb 2022 4:25 AM GMT
స్పేష్ స్టేషన్ అమెరికా, యూరప్ పై పడితే మా బాధ్యత కాదన్న రష్యా చీఫ్
X
ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో పరిస్థితులు చేజారుతున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చీఫ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా కొత్తగా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంపై ఇరు దేశాల సహకారం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల స్పేస్ స్టేషన్ నియంత్రణ కోల్పోతే అమెరికా, ఐరోపా, భారత్ , చైనా వంటి దేశాలపై అది పడొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై ఐఎస్ఎస్ తిరగదని.. అందువల్ల తమ దేశానికి ఎటువంటి ముప్పు లేదని రోస్ కాస్మోస్ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను శిక్షించడం కోసం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కఠిన ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యాకు సాంకేతిక, అంతరిక్ష, సైనిక రంగాల్లో సహకారంపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. రష్యా బ్యాంకులు, ఆ దేశానికి సహకరించే వ్యక్తులు, సంస్థలపైన కూడా అమెరికా ఆంక్షలను విధించింది. దీంతో అమెరికా తాజా అంశాలపై రోస్ కాస్మోస్ చీప్ డిమిత్రి రోగోజిన్స్ స్పందించారు. దీనివల్ల జరుగనున్న పరిణామాలను హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.

రష్యాకు సహకారాన్ని అడ్డుకుంటే స్పేస్ స్టేషన్ తన కక్ష నుంచి గతి తప్పి అమెరికా లేదా ఐరోపాపై పడితే ఎవరు కాపాడుతారో చెప్పాలంటూ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ప్రశ్నించారు. సుమారు 500 టన్నుల బరువైన అంతరిక్ష కేంద్రం భాగాలు భారత్ లేదా చైనాపై పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. మమ్మల్ని మీరు బెదిరించాలని అనుకుంటున్నారా? అంటూ అమెరికాను రష్యా చీఫ్ ప్రశ్నించారు.

ఐఎస్ఎస్ రష్య మీదుగా ప్రయాణించదు కాబట్టి అది కూలితే రష్యాకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. అది కూలితే ఎన్ని నష్టాలో మీకే తెలుసు అంటూ అమెరికాను హెచ్చరించారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దంటూ అమెరికాను హెచ్చరించారు.

దీంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పందించింది. కొత్త ఆంక్షలు రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారానికి హాని కలిగించవని నాసా స్పష్టం చేసింది. రష్యాతో సంబంధాలకు దీని వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఐఎస్ఎస్ లో ఆపరేషన్ల కోసం రష్యాతోపాటు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది.