Begin typing your search above and press return to search.

హిజాబ్ ను టచ్ చేస్తే చేతులు నరికేస్తుందట.. యూపీకి పాకింది

By:  Tupaki Desk   |   13 Feb 2022 4:43 AM GMT
హిజాబ్ ను టచ్ చేస్తే చేతులు నరికేస్తుందట.. యూపీకి పాకింది
X
ఒక సంచలనం.. దానికో ఎమోషన్ ఉంటే.. అంతకు మించి కావాల్సిందేముంది? ఇప్పుడు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు అంతకంతకూ విస్తరిస్తోంది. మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాల్సిన ఇష్యూను.. అంతకంతకూ విస్తరిస్తూ.. ఇష్యూను మరింత ముందుకు తీసుకెళ్లటం ద్వారా రాజకీయ లబ్థిని పొందాలన్న రాజకీయ పార్టీల యోచన ఇప్పుడు కొత్త రగడకు కారణంగా మారనుంది. విద్యా సంస్థలకు హిజాబ్ తో వద్దంటూ తీసుకున్న నిర్ణయంపై మొదలైన లొల్లి అంతకంతకూ విస్తరిస్తోంది.

కర్ణాటకలో మొదలైన ఈ రగడ.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ నిరసనలు చోటు చేసుకోవటం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ కు ఈ ఇష్యూ టచ్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ ఇష్యూను రచ్చ చేయటం ద్వారా రాజకీయ రగడకు తెర తీసే ప్రయత్నాలు మహా జోరుగా సాగుతున్నాయి.

ఓపక్క ఇదే ఇష్యూ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఎవరూ తొందరపడొద్దని.. నియంత్రణను వీడిపోవద్దంటూ చేసిన వ్యాఖ్యల్ని పక్కన పెట్టేసి.. ఎంత ఘాటుగా మాట్లాడితే.. అంత త్వరగా ఈ ఇష్యూ ముందుకు వెళ్లేలా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిజాబ్ ఇష్యూను సమర్థంగా తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది. ఇందుకు తగ్గట్లే సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహిళా నేత రుబీనా ఖానం చెలరేగిపోయారు. తాజాగా కర్ణాటకలోని కొన్ని విద్యాసంస్థలు హిజాబ్ ను నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా అలీగఢ్ ముస్లిం వర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ మహిళా నేత రుబీనా ఖానం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిజాబ్ ను తాకేందుకు ప్రయత్నించే చేతుల్ని నరుకుతానని ఆమె మండిపడ్డారు. దేశ అక్కాచెల్లెళ్లు.. కుమార్తెల ఆత్మగౌరవాన్ని ఆడుకోవాలని ప్రయత్నిస్తే.. మహిళలు ఝాన్సీ రాణి, రజియా సుల్తానాల్లా మారతారని.. హిజాబ్ ను టచ్ చేసే వారి చేతుల్ని తెగ నరకటానికి ఎంతో సమయం పట్టదని పేర్కొన్నారు. కొందరు నుదుట తిలకం దిద్దుకుంటే.. మరికొందరు తలపాగా ధరిస్తారన్నారు. ఇంకొందరు హిజాబ్ ధరిస్తారన్నారు.

కొంగుతోముఖాన్ని దాచుకోవటం మన దేశ కల్చర్ లో భాగమని.. సంప్రదాయంగా కూడా పాటిస్తారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వీటిని వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తంగా హిజాబ్ ఎపిసోడ్ ను విజయవంతంగా యూపీలోకి తీసుకొచ్చిన సమాజ్ వాదీ నేత.. తన తదుపరి రాజకీయ కార్యాచరణ ఇదే అంశం మీద కొనసాగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.