Begin typing your search above and press return to search.

ఈటల సతీమణికి దిమ్మ తిరిగే షాక్.. రానున్న రోజుల్లో ఇలాంటివి తప్పవా?

By:  Tupaki Desk   |   18 July 2021 3:39 AM GMT
ఈటల సతీమణికి దిమ్మ తిరిగే షాక్.. రానున్న రోజుల్లో ఇలాంటివి తప్పవా?
X
గతానికి వర్తమానానికి చాలానే వ్యత్యాసం ఉంది. మారుతున్న కాలంతో పాటు రాజకీయ రంగులు సైతం అనూహ్యంగా మార్పులు చెందుతున్నాయి. గతంలో రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరు. కానీ.. ఇప్పుడు ఆ రెండింటికి మధ్యన విడదీయలేని బంధంగా మారాయి. దీంతో.. గతంలో ఎదురుకాని ఎన్నో ఉదంతాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయాల్లో ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించటానికి నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. గతంలో విమర్శలు.. ఆరోపణలు.. చాలా అరుదుగా మాత్రమే వ్యక్తిగత అంశాల్ని తెర మీదకు రావటం.. వ్యక్తిత్వ హననం జరుగుతుండేది. ఇప్పుడు అలాంటివన్నీ సర్వ సాధారణంగా మారిపోయాయి.

రాజకీయ ప్రయోజనం కోసం దేనికైనా.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. ఇదే తీరు గల్లీ నేత మొదలు ఢిల్లీ నేత వరకు మాత్రమే కాదు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సైతం ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. దీంతో.. రాజకీయాల్లో సరికొత్త సిత్రాలు తరచూ తెర మీదకు వస్తున్నాయి. దీనికి తోడు రాజకీయంలోకి విపరీతంగా వచ్చి పడుతున్న డబ్బులు కూడా పాలిటిక్స్ ను పాలిట్రిక్స్ గా మార్చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఉదంతాల్ని చూస్తే.. టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుండటమేనని చెప్పాలి.

తన పార్టీకి చెందిన నేతలపై ఆరోపణలు.. విమర్శలు ఎన్ని వచ్చినా పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తత్త్వం గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే కేసీఆర్ కు ఎప్పుడైనా లెక్కలు తేడా వచ్చి.. మూడ్ మారితే సీన్ ఎంతలా మారుతుందన్న విషయం ఈటల రాజేందర్ ఇష్యూను చూసినంతనే అర్థమవుతుంది. కొందరు రైతులు కేసీఆర్ ఫాం హౌస్ కు రావటం ఏంటి? అలా వచ్చినంతనే కేసీఆర్ దర్శనం లభించటం ఏమిటి? వారు ఒక వినతిపత్రం ఇచ్చి.. అందులో ఈటల మీద భూకబ్జా ఆరోపణలు చేయటం.. గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయాలు తీసుకోవటం.. రెండు రోజుల వ్యవధిలోనే మంత్రి వర్గం నుంచి తప్పించటం మొదలు జరిగిన కథంతా అందరికి తెలిసిందే.

ఇదంతా చూస్తే.. ఇప్పటి రాజకీయాలు ఎలా మారాయన్న దానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈటల తీరు నచ్చకుంటే.. పిలిపించి..తీరు మార్చుకోవాలని చెప్పాలి. పదవికి రాజీనామా చేయమని కోరచ్చు. ఇంతలా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం.. ఆమోద ముద్ర పడటం.. ఉప ఎన్నికల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేయటం తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ఈటల ఫ్యామిలీ తమ సత్తా చాటేందుకు తెగ కష్టపడుతోంది. ఎండ.. వానా అన్నది తేడా లేకుండా విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను కలవటం.. స్థానిక నేతలతో మంతనాలు జరపటం లాంటివి చేస్తున్నారు. చావో రేవో అన్నట్లుగా మారిన ఉప ఎన్నికల్లో ఈటల ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఉంది. తేడా వచ్చి ఓటమి పాలైతే.. జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి వేళ వారు ఊహించని షాకులు తగులుతున్నాయి.

తాజాగా ఈటల సతీమణి జమున హుజురాబాద్ పర్యటనలో ఉండగా ఒక బాధితుడు ఆమె ముందే.. ఈటల ఫోటోతో కూడిన గడియారాన్ని నేలకు విసిరి కొట్టి తన నిరసనను వ్యక్తం చేయటంతో ఆమె షాక్ కు గురయ్యారు. తమ సొంత నియోజకవర్గంలో ఇంతటి వ్యతిరేకత ఎందుకన్నది మరింత విచిత్రంగా మారింది. హుజురాబాద్‌లోని మామిళ్లవాడలో ఈటల సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు..కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి తన కొడుకు మరణానికి ఈటల రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించి కేవలం రూ.లక్ష మాత్రమే ఇప్పించారని ఆరోపించారు.

మిగిలిన రూ.4లక్షలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రచ్చ చేశాడు. ఈటల సతీమణి జమునను నిలదీసి ఆమెకు నోట మాట రానివ్వని విధంగా వ్యవహరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఉదంతాలతో జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రచ్చ చేసిన శ్రీను ఉదంతం గురించి ఆరా తీసిన వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. శ్రీనుకొడుకు మరణం తర్వాత.. అతడి భార్యకు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉద్యోగాన్ని కల్పించారని.. అందుకు ఈటలే చొరవే కారణమని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రచ్చ చేస్తే.. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న ఉద్దేశంతో ఇంత లొల్లి చేసినట్లుగా చెబుతున్నారు. ఉప ఎన్నిక పూర్తి అయ్యే లోపు ఇలాంటివెన్నో తెర మీదకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.