Begin typing your search above and press return to search.

అమ్మాకొడుకులు కోర్టుకు వస్తారట

By:  Tupaki Desk   |   10 Dec 2015 8:09 AM GMT
అమ్మాకొడుకులు కోర్టుకు వస్తారట
X
నేషనల్ హెరాల్డ్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. రాహుల్ గాంధీలు ఇద్దరూ ఈ నెల 19న పాటియాలా కోర్టుకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. దాదాపుగా రూ.2వేల కోట్ల ప్రయోజనాన్ని పొందినట్లుగా లెక్కలు చెబుతున్న ఈ కేసు విషయంలో సోనియా.. రాహుల్ ఇద్దరూ కోర్టు గుమ్మం ఎక్కకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలన్న భావనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. తాజాగా అందుకు భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయటానికి సిద్ధమైనట్లు చెబుతున్నాయి.

ప్రధానమంత్రి కార్యాలయం చొరవతోనే.. కోర్టులు తమను ఇబ్బంది పెడుతున్నాయంటూ అటు సోనియా.. ఇటు రాహుల్ గాంధీలు మోడీ సర్కారు మీద విరుచుకుపడుతూ.. తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేయటం తెలిసిందే. గత మూడు రోజులుగా పార్లమెంటు జరగకుండా అడ్డుకుంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ నెల 19న కోర్టుకు హాజరు కాకుండా ఉండాలని అమ్మాకొడుకులు ప్లాన్ వేసుకున్నారని.. కానీ.. తాజాగా అందుకు భిన్నమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. సుప్రీంను ఆశ్రయించకుండా.. పాటియాల కోర్టుకు హాజరు అయ్యేందుకు వీరిద్దరూ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంటులో ఆందోళన చేయటం ద్వారా దేశంలో చర్చను రేకెత్తించిన కాంగ్రెస్ పార్టీ.. తాము కానీ కోర్టుకు వెళ్లకుండా సుప్రీంకు వెళితే.. పూర్తి స్థాయి రాజకీయ లబ్థి కలగదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే.. న్యాయస్థానాల మీద తమకున్న గౌరవాన్ని చాటి చెప్పేలా పాటియాలా కోర్టుకు అమ్మాకొడుకులు ఇద్దరూ హాజరు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. రూటు మార్చి కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం దాన్ని ఎంతవరకూ అమలు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.