Begin typing your search above and press return to search.

సినీ రంగం పై సోము షాకింగ్ కామెంట్స్..ఏమైందంటే

By:  Tupaki Desk   |   8 Sep 2021 5:11 AM GMT
సినీ రంగం పై సోము షాకింగ్ కామెంట్స్..ఏమైందంటే
X
కరోనా మహమ్మారి విజృంభణ , అలాగే మూడో వేవ్ ముంచుకొస్తుందనే వార్తలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది వినాయక్ చవితి ఉత్సవాలపై కఠినమైన ఆంక్షలు విధించింది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజలంతా ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇదే అంశంపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంశాన్ని క్యాష్ చేసుకొని తమ ప్రాబల్యం చాటుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని చెప్పాలి. ప్రతి ఆదివారం వందల మందితో నిండుకునే చర్చిలకు లేని ఆంక్షలు,రంజాన్,బక్రీద్,మొహరం పండుగలకు లేని ఆంక్షలు,పాఠశాలలు,సినిమా హాళ్ళు తెరవడానికి,వేల మందితో బహిరంగ సభలు నిర్వహించటానికి లేని ఆంక్షలు ఒక్క హిందువులు ఘనంగా నిర్వహించుకునే వినాయకచవితి పండుగకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

ఏపీ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన మరుక్షణం నుండే సోము వీర్రాజు రంగంలోకి దిగాడు. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో షాకింగ్ కామెంట్ చేశారు. ఈ రచ్చ లోకి సినీ రంగాన్ని లాగాడు. వినాయ‌క చ‌వితి వేడుక‌ల విష‌యంలో సినీ హీరోలు త‌మ గ‌ళాన్ని విప్పాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. సినిమా షూటింగ్స్ ప్రారంభానికి ముందు వినాయ‌కుడికి టెంకాయ‌లు కొట్టే వారు వేడుక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో నోరు తెరచి అడగరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మెజార్టీ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను సినీ రంగం గౌర‌వించాల‌ని ఆయ‌న కోరారు.సినీ హీరోలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అస‌మ్మ‌తి గ‌ళాన్ని వినిపిస్తే, వారి అభిమానుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని సోము వీర్రాజు ఎత్తుగ‌డ వేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రస్తుతం సినీ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ పార్టీ జనసేన తో పొత్తు కుదుర్చుకున్న బీజేపీకి, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి పెద్ద‌గా సానుకూల‌త రావ‌డం లేదు. దీంతో వారిని టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి వినాయ‌క చ‌వితి వేడుక‌ను వాడుకుంటోంద‌ని చెప్పొచ్చు. అయితే , టాలీవుడ్ హీరోలలో చాలామందికి వైసీపీ ప్రభుత్వంతో, అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వారి డిమాండ్స్ పై కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఏ హీరో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేనట్టే. ఇక మరీ ముఖ్యంగా తెలుగు న‌టీన‌టులు, ఇత‌ర విభాగాల ప్ర‌తినిధులు కేవ‌లం ప్ర‌శంస‌ల‌కే త‌ప్ప విమ‌ర్శ‌ల‌కు ముందుకురారు. ఈ విషయం ఇప్పటికే పలుసార్లు నిరూపితం అయ్యింది.

కరోనా దృష్ట్యా వినాయక విగ్రహాలు బయట పెట్టడానికి వీల్లేదని... నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని స్పష్టం చేసింది.ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వ తీరును నిరససిస్తున్నారు. ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందని మండిపడుతున్నారు.