Begin typing your search above and press return to search.

సోము వీర్రాజు బాధేంటో..?

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:07 AM GMT
సోము వీర్రాజు బాధేంటో..?
X
ఏపీలో టీడీపీ, బీజేపీ పొరపొచ్చాలు మళ్లీమళ్లీ బయటపడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ముంపు గ్రామాల అంశంపై ఆయన మాట్లాడారు. పోలవరం ముంపు గ్రామాలలోని గిరిజలను ఉన్నపళంగా ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలతో సోము వీర్రాజు మండిపడ్డారు. గిరిజనుల పట్ల అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24 లోగా గ్రామాలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సోము వీర్రాజు తప్పుబట్టారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని చెప్తే గిరిజనుల పరిస్థితేంటని ప్రశ్నించారు. పరిహారం అందేదాకా బిజెపి అండగా ఉంటుందన్నారు.

అయితే.. బీజేపీ ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎలా పోరాడుతుందో చూడాలి. ఇది వీర్రాజు మాటో పార్టీ మాటో ఇంకా తెలియాల్సిఉంది. అయితే... సోము వీర్రాజు చాలాకాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆయన చంద్రబాబు రాష్ట్రంలో లేనప్పుడే కారాలు మిరియాలు నూరుతుంటారు. వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.