Begin typing your search above and press return to search.

అమీర్ ఫ్యామిలీకి పాక్ ఫ్లైట్ టిక్కెట్లు కొనేశారు

By:  Tupaki Desk   |   27 Nov 2015 10:09 AM IST
అమీర్ ఫ్యామిలీకి పాక్ ఫ్లైట్ టిక్కెట్లు కొనేశారు
X
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటం తెలిసిందే. అమీర్ వ్యాఖ్యల్ని ఖండించే వారు ఖండిస్తుంటే.. మరికొందరు అతివాద నేతలు.. సంఘాలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. లూధియానలో శివసేన కార్యకర్తలు అమీర్ ను చెంపదెబ్బ కొట్టే వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొనటం తెలిసిందే. అమీర్ ను కొట్టే ప్రతి చెంపదెబ్బకు లక్ష రూపాయిల చొప్పున నజరానా ఇవ్వటమే కాకుండా.. దేశ భక్తుడిగా కీర్తిస్తామంటూ నిరసన చేయటం ఒకపక్క సరికొత్త సెగలు రేపుతుంటే.. మరోవైపు హిందూసేన మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది.

ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్టు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీలుగా మూడు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసినట్లుగా హిందూసేన ప్రకటించటమే కాదు.. ట్విట్టర్ లో ఆ టిక్కెట్లను పోస్ట్ చేశారు కూడా. సదరు టిక్కెట్ల మీద అమీర్ ఖాన్.. కిరణ్ రావ్.. వారి కుమారుడి పేర్ల మీద బుక్ అయినట్లుగా ఉన్నాయి. అయితే.. ఈ టిక్కెట్లను బుక్ చేసింది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే.. ఇలాంటి దూకుడు చర్యలు సరికావన్న భావన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో అమీర్ మరెన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందో..?