Begin typing your search above and press return to search.

సౌర విద్యుత్‌ : ఆధిపత్యం కోసం రిలయన్స్ , అదానీ ఢీ !

By:  Tupaki Desk   |   8 July 2021 6:30 AM GMT
సౌర విద్యుత్‌ : ఆధిపత్యం కోసం రిలయన్స్ , అదానీ ఢీ !
X
సోలార్ పవర్ .. భవిష్యత్ కి భరోసా. నీరు , బొగ్గు కంటే తక్కువ ఖర్చు తో ఎక్కువ ఉత్పత్తికి అవకాశం ఉండటం తో ప్రస్తుతం అందరి చూపు సౌర విద్యుత్ పై పడింది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ కావడంతో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సౌర విద్యుత్ వైవు తొంగి చూస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే సోలార్ పవర్ ఉత్పత్తి, వాడకం పెరుగుతోంది. దీనితో ఇప్పటి నుండే ఆవైపుగా అడుగులు వస్తే భవిష్యత్ లో లాభాలు భారీగా ఆర్జించవచ్చు అనే ముందుచూపుతో కొందరు అటువైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక మనదేశంలోని కుబేరుల్లో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య ఇప్పటి వరకు ఏ వ్యాపారంలోనూ పోటీలేదు. ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం , అలాగే ఇద్దరూ కూడా ప్రధాని మోడీకి సన్నిహితులు కావడంతో వారి వ్యాపారాల్లో ఇప్పటివరకు ఒకరికి ఒకరికి పోటీపడలేదు. కానీ వీరిద్దరూ సౌర విద్యుత్‌ రంగంపై ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు.

ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు అంటే .. ఒకరు ముకేశ్ అంబానీ ( రిలయన్స్ గ్రూప్) కాగా , మరొకరు గౌతం అదానీ (అదానీ గ్రూప్‌). ఈ ఇద్దరూ సోలార్ విద్యుత్ పోటీతో తొలిసారి వ్యాపారంలో పోటీ పడబోతున్నారు. ఈ కారణంగా సౌర విద్యుత్‌ ధరలు సామాన్యునికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అంబానీ రిఫైనరీ, పెట్రో కమికల్స్‌, టెక్స్‌టైల్స్‌, రిటైల్‌, టెలికం రంగాల్లోఉన్నాయి. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ఓడ రేవులు, విమానాశ్రయాలు, వంట నూనెలు, కోల్‌ (బొగ్గు) వ్యాపారంలో అదానీ ఉన్నారు. ప్రస్తుతం చేస్తునట్టు బొగ్గు, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాలతో ఉత్పత్తి చేసే విద్యుత్‌తో పర్యావరణం దెబ్బ తింటోంది. వీటి దిగుమతులూ ప్రభుత్వ ఖజానాకు భారంగా మారాయి. దీంతో 2030 కల్లా దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 4.5 లక్షల మెగావాట్లకు పెంచాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇపుడున్న సామర్ధ్యంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ అని నిపుణులు వెల్లడించారు .

ఈ కారణంతో వచ్చే తొమ్మిదేళ్లలో 1,000 కోట్ల డాలర్ల (దాదాపుగా రూ.74,000 కోట్లు) పెట్టుబడులతో దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేస్తామని ఈ మధ్యనే జరిగిన రిలయన్స్‌ ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ఏడాదికి 5,000 మెగావాట్ల చొప్పున వచ్చే పదేళ్లలో 50,000 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేస్తామని అదానీ సంస్థ ఓ కీలక ప్రకటన వెల్లడించింది. ర విద్యుత్‌ టారిఫ్ లు ఇప్పటికే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కంటే తక్కువకు వచ్చాయి. ఇటీవల గుజరాత్‌ లో ఒక సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కోసం జరిగిన వేలంలో ఒక కంపెనీ కిలోవాట్‌ అవర్‌ కు రూ.2 కంటే తక్కువ ధర కోట్‌ చేసింది. అంబానీ, అదానీల పోటీతో 2030 నాటికి ఇది రూపాయికి దిగి వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. టెలికాం రంగంలో రిలయన్స్‌ ట్రాక్‌ రికార్డే ఇందుకు ఉదాహరణ. రిలయన్స్‌ జియో చౌక టారిఫ్ ల దెబ్బకు తట్టుకోలేక కొన్ని టెలికం కంపెనీలు దుకాణాలు మూసుకోగా, కొన్ని విలీనాలతో కాల గర్భంలో కలిసిపోయాయి. అయితే , సోలార్ పవర్ కోసం అంబానీ , అదానీ పోటీ పడితే సామాన్యులకి లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది.