Begin typing your search above and press return to search.

హ‌త్య‌కేసులో మ‌రో మ‌లుపు.. వీడిన మిస్ట‌రీ

By:  Tupaki Desk   |   5 Sep 2019 4:53 PM GMT
హ‌త్య‌కేసులో మ‌రో మ‌లుపు.. వీడిన మిస్ట‌రీ
X
థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించే రీతిలో రోజుకో మ‌లుపు తిరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స‌తీష్ హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీకి చెందిన సతీశ్ ను అత‌డి ఫ్రెండ్ అయిన హేమంతే హ‌త్య చేశాడ‌ని పోలీసులు తేల్చారు. గత నెలలో జరిగిన ఈ హ‌త్య‌కు సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు. స‌తీష్ తో పాటు త‌న‌కూ ప‌రిచ‌యం ఉన్న ప్రియాంక అనే త‌మ కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగి కోస‌మే హేమంత్ ఈ హ‌త్య చేసిన‌ట్లు డీసీపీ వెల్ల‌డించారు. ముందు స‌తీష్ త‌ల‌మీద ఐరెన్ రాడ్ తో కొట్టి.. ఆపై కత్తితో పొడిచి హత్య చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. హేమంత్ ఇంట్లోనే సతీశ్ మృతదేహం దొరికిందని తెలిపారు.

హ‌త్య జ‌రిగిన క్ర‌మం గురించి డీసీపీ వివ‌రించారు. ఆయన చెప్పిన ప్ర‌కారం.. గత నెల 27న సతీష్ కు హేమంత్ ఫోన్ చేశాడు. మద్యం బాటిళ్లు తీసుకుని తన గదికి రావాలని చెప్పాడు. సతీష్‌ తో పూటుగా మద్యం తాగించి.. అత‌ను మ‌త్తులో కూరుకుపోయాక హేమంత్.. ఐరెన్ రాడ్ తో అత‌డి తలపై కొట్టాడు. త‌ర్వాత కత్తితో పొడిచాడు. గొంతు కోశాడు. ఆపై సతీష్‌ శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేందుకు హేమంత్ విఫలయత్నం చేశాడు. సతీష్‌ మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు కొన్ని కవర్లు కూడా హేమంత్ తీసుకొచ్చాడు. కానీ తాను అనుకున్న‌ట్లుగా ప్యాక్ చేయడం సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేశాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సతీశ్, హేమంత్ భాగ‌స్వాములు కావ‌డం గ‌మ‌నార్హం. ప్రియాంక అనే త‌మ కంపెనీలో ప‌ని చేసే అమ్మాయి విష‌యంలో త‌లెత్తిన గొడ‌వే హ‌త్య‌కు దారి తీసిన‌ట్లు వెల్ల‌డైంది.