Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ పెద్దాయన మనసులో ఇంత కుళ్లుందా?

By:  Tupaki Desk   |   1 Nov 2015 3:45 AM GMT
ఇన్ఫోసిస్ పెద్దాయన మనసులో ఇంత కుళ్లుందా?
X
భారతదేశ ముస్లింలలో భయం ఆవహించిందన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. నారాయణ మూర్తి వ్యాఖ్యలను సమర్థిస్తూ అనుకూలంగా కొందరు...ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ మరికొందరు తమ వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో నారాయణమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే... నారాయణమూర్తికి అనుకూలంగా పది కామెంట్లు కనిపిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా వంద కనిపిస్తున్నాయి. దీంతో ఇంతకాలం ఆయన సాధించుకున్న గొప్ప ఇమేజ్ ని కోరి డ్యామేజ్ చేసుకంటున్నట్లవుతోంది. అదేసమయంలో మత అసహనం వల్ల దేశం ఆర్థికంగా ఎదగలేదన్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ వ్యాఖ్యలపైనా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరినీ కలిసికట్టుగా వాయిస్తున్నారు.

నారాయణమూర్తి వ్యాఖ్యలపట్ల ఆన్ లైన్ సమాజం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నారాయణమూర్తి వ్యాఖ్యలకు ఆధారాలేంటో చూపించాలని కొందరు... కాదుకాదు.. ఆయన కొడుకును సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ పదవినుంచి తప్పించారన్న కోపంతో ఆయన ఇలా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ట్విట్టర్ మూర్తిగారిపై పడిన పంచ్ లివీ..

- ఈ పెద్దమనిషికి చాలా చిన్న హృదయం ఉంది. జాతీయ ప్రయోజనాల కంటే ఈయనకు స్వీయ ప్రయోజనాలే ముఖ్యం

- నారాయణమూర్తి - రఘురామ్ రాజన్ లు అసహనం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి అంటున్నారు... హార్దిక్ పటేల్ ఆందోళనలు చేసినప్పుడు వారెందుకు మాట్లాడలేదు.

- సాఫ్టువేర్ వర్గాలు - బిజినెస్ వర్గాలు పరంగా నారాయణమూర్తి కొడుక్కి బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేయలేదు... అది మనసులో ఉంచుకునే నారాయణమూర్తి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నారాయణమూర్తికి సిగ్గయినా వేయదా..?

- సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ పదవిలో ఉన్న నారాయణమూర్తి కొడుకు రోహన్ నారాయణమూర్తిని కేంద్రం జూన్ లో తప్పించి.. ఆయన స్థానంలో మనీష్ సభర్వాల్ ను నియమించింది... నారాయణమూర్తి బాధంతా అదే

- మోడీ ఐటీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు... దానివల్ల తమ గుత్తాధిపత్యానికి దెబ్బపడుతుందన్న అక్కసే నారాయణమూర్తితో అలా మాట్లాడించింది.

- నారాయణమూర్తికి ఎంతమంది మైనారిటీలు తెలుసు..? అసలు ఆయన మైనారిటీలను ఎప్పుడైనా కలిశారా..?

- సేవాసంస్థలు - ట్రస్టులు స్థాపించి విదేశీ నిధులు సంపాదించుకుంటున్నవారంతా ఇలాగే మాట్లాడుతారు

...ఒకటా రెండా ఇలా లెక్కలేనన్ని కామెంట్లు. ఆయనకు మద్దతుగా మాట్లాడినివారు కూడా ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు.

నారాయణమూర్తి గురించి అధికశాతం మందికి మంచిగానే తెలుసు.. ఆయన కుమారుడిని పదవి నుంచి తప్పించడం.. ఐటీ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల వీరికి ఉన్నభయం వంటి కోణాలు చాలామందికి తెలియవు. అయితే... నారాయణమూర్తి వ్యాఖ్యలకు సోషల్ మీడియా స్పందించిన కారణంగా మొత్తం గుట్టంతా బయటపడింది. నారాయణమూర్తి దారిన పోయే కంపను కాలికి తగిలించుకున్నట్లయింది.