Begin typing your search above and press return to search.

ఓటుకునోటుః లేటెస్ట్ ట్విస్ట్​​

By:  Tupaki Desk   |   2 Dec 2015 9:26 AM GMT
ఓటుకునోటుః లేటెస్ట్ ట్విస్ట్​​
X
ఓటుకు నోటు కేసు...తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ కేసు సంచ‌ల‌నం సంగ‌తి చెప్ప‌క్క‌ర్లేదు. త‌మ‌కే ఓటు వేయాల‌ని కోరే క్ర‌మంలో టీడీపీ వారి ప్రలోభాల‌ను రికార్డ్ చేసి బ‌య‌ట‌పెట్ట‌డం అవి కోర్టులు, కేసుల స్థాయికి చేరి ఇప్ప‌టికీ ర‌చ్చ త‌గ్గ‌లేదు. తాజాగా తెలంగాణాలో వచ్చే నెలలో జరుగనున్న స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్‌సీ ఎన్నికల నేప‌థ్యంలో కొత్త రూపంలో ఈ ఇష్యూ తెర‌మీదికి వ‌చ్చింది.

తెలంగాణాలో జరుగనున్న స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్‌ సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పటి నుండే గాలాలు వేయటం మొదలైంది. దాంతో అప్రమత్తమైన ఆయా పార్టీలు ఓటర్ల‌ను ముందు జాగ్రత్త గానే బుక్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ నేతలమని చెప్పుకుంటు పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీల ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రలోబాలు, మరికొన్ని చోట్ల ఒత్తిళ్ళకు కూడా దిగుతున్నట్లు సమాచారం. దాంతో తమ ఓట్లను అధికార పార్టీ తన్నుకు పోకుండా కాపాడుకునేందుకు ఆయా పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార-ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రయత్నాలు ఏదో ఒక జిల్లాకు పరిమితం కాకుండా మొత్తం 10 జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా పరిస్ధితి కనబడుతుండటం గమనార్హం.

పోలింగ్ తేదీకి ఇంకా చాలా రోజులు ఉండ‌టం, ప్రలోభాలకు గురిచేయటంలో సహజంగానే అధికార పార్టీ నేతలే ముందుంటున్న నేప‌థ్యంలో తమ ఓటర్లను జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రతిపక్షాలకు శక్తికి మించిన పని అవుతోంది. అధికారపార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక పలువురు స్థానిక ప్రతినిధులు కొత్తగా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్లలో రికార్డింగ్ యాప్‌ లను డౌన్ లోడ్ చేసుకుని అధికారపార్టీ నుండి వచ్చే ప్రతీ ఫోన్ కాల్‌ను, సంభాషణను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పటికి ఖమ్మం జిల్లాలో వెలుగు చూస్తు న్నాయి. కొణిజెర్ల-1 - కొణిజెర్ల-2 మండలాలకు చెందిన సీపీఐకి చెందిన ఎంపీటీసీ సభ్యుల‌కు అధికార పార్టీ నుండి అని చెబుతూ వస్తున్న ఫోన్లను మ‌హిళ‌ సభ్యుల‌ భర్తలు రికార్డ్ చేసి బయట పెట్టటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాంతో మిగిలిన పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ పరిస్ధితి ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాకుండా అన్నీ జిల్లాల్లోనూ ఇదే విధంగా ఉంది. ఓట్ల సంఖ్యలో పెద్దగా తేడాలు లేకపోవటం, అధికార పార్టీకి వ్యతిరేకంగా పలు జిల్లాల్లో ప్రతి పక్షాలు ఒకటవటంతో ఎన్నికలు ఉత్కంఠగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

నామినేషన్లు తేదీ దగ్గర పడేకొద్దీ ఒత్తిళ్ళు కూడా పెరిగిపోవ‌డం స‌హజం. ఈ నేప‌థ్యంలో ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ముందుజాగ్రత్తగా సంభాషణలను రికార్డింగ్ చేసి పెట్టుకునే క్ర‌మంలో భాగంగా రికార్డింగ్ సదుపాయంతో రెడీగా ఉంటున్నారు. మొత్తంగా ఎన్నిక‌ల పుణ్య‌మా అని తెలంగాణ‌లో స్మార్ట్ ఫోన్‌ ల‌కు డిమాండ్ పెర‌గ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే.