Begin typing your search above and press return to search.

ఏపీలో ఆరుగురు సజీవ దహనం.. తరచి చూస్తే అన్ని అనుమానాలే

By:  Tupaki Desk   |   31 July 2021 5:39 AM GMT
ఏపీలో ఆరుగురు సజీవ దహనం.. తరచి చూస్తే అన్ని అనుమానాలే
X
పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి ఏపీకి వచ్చిన వారు ఊహించని విధంగా మరణించిన వైనం షాకింగ్ గా మారింది. నిద్రలోనే సజీవ దహనమైన ఆరుగురి తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అగ్నిప్రమాదంగా చెబుతున్నప్పటికీ.. ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని లంకెవాని దిబ్బ గ్రామం సమీపంలోని రొయ్యల చెరువు వద్ద జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయితే.. ఈ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్థరాత్రి వేళ జరిగిన ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా.. మరో ఆరుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ అసలేం జరిగింది? ఈ ప్రమాదంపై వినిపిస్తున్న భిన్న వాదనలు ఏమిటన్నది చూస్తే..

ఒడిశాలోని రాయగడ జిల్లాకు చెందిన వారు అక్వాఫాంలో మేత వేయటం.. రసాయనాలు చల్లటం.. మోటార్ల నిర్వాహణ.. కాపలా కాయటం లాంటి పనుల్ని బాగా చేస్తారన్న పేరుంది. ఈ నేపథ్యంలో రేపల్లె మండలంలోని లంకెవాని దిబ్బ గ్రామ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద పని చేసేందుకు ఒడిశాకు చెందిన సిబ్బందిని పనిలో పెట్టుకున్నారు. చెరువు పక్కనే రేకులు షెడ్డులు వేసి.. అందులో వారికి బస ఏర్పాటు చేశారు. పది మందితో కలిసి నిద్రపోతున్న షెడ్ లో అర్థరాత్రి వేళ.. పొగతో పాటు మంటలు రేగటం.. వేడి కారణంగా మెలుకువ వచ్చిన నలుగురు బయటకు రాగా.. మరికొందరు లోపల చిక్కుకుపోయారు.

అతి కష్టమ్మీద మంటలు ఆర్పిన తర్వాత లోపలికి వెళ్లి చూస్తే.. ఆరుగురు సజీవ దహనమైనట్లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం భీతావాహంగా ఉండటంతో పోలీసులు లోపలకు ఎవరిని అనుమతించలేదని చెబుతున్నారు. మరణించిన వారిలో ఒకరు మినహా మిగిలిన ఐదుగురు బాలకార్మికులేనని వారంతా 18 ఏళ్ల లోపు వారని తెలుస్తోంది. పూర్తిగా కాలిపోయిన వారిని.. ముట్టుకుంటే రాలిపోతారన్నట్లుగా ఉండటంతో లోపలకు ఎవరిని అనుమతించలేదని చెబుతున్నారు. వారి కుటుంబీకులు వచ్చిన తర్వాత.. వారికి డెడ్ బాడీలు చూపించిన తర్వాత తదుపరి కార్యక్రమాలు చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికి డెడ్ బాడీలు అక్కడే ఉంచేశారు.

అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యుట్ కారణమని భావించినా.. అలాంటివేమీ లేదని విద్యుత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రొయ్యల చెరువుకు వినియోగించేందుకు బ్లీచింగ్ పౌడర్ బస్తాలు.. మండే స్వభావం ఉన్న ఫార్మాల్డిహైడ్ ను వాడుతుంటారు. అది మండినప్పుడు వచ్చే పొగ కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. దోమలు కుట్టకుండా ఉండేందుకు వాడిన కాయిల్స్ తో అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత అగ్నిప్రమాదానికి కారణం

ఏమిటో తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- కెమికల్ బ్లాస్ట్ వల్లే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే.. అన్ని బస్తాలు బ్లీచింగ్ ఉన్న చోట.. ఆ ఘాటు వాసనకు నిద్ర పట్టే అవకాశం ఉంటుందా?

- బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలోనే కూలీలు ఎందుకు నిద్రపోయినట్లు? పక్కన కూడా షెడ్లు ఉన్నప్పుడు వాటిలో పడుకోలేదెందుకు?

- ప్రమాదం జరిగిన గదిలో పది మంది నిద్రపోయారని కొందరు.. లేదు ఆరుగురే నిద్రపోయినట్లు చెబుతుున్నారు.

- అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే.. షెడ్డులో నుంచి బయటకు తీసుకురావటం కష్టమేమీ కాదు. మరి.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురిని ఎందుకు తీసుకురాలేకపోయారు?

- అక్కడున్న ఆరు గదులు ఖాళీగా ఉండగా.. బ్లీచింగ్ పౌడర్ బస్తాలు ఉన్న చోటనే ఎందుకు నిద్ర పోయినట్లు?

- అక్కడ ఏర్పాటు చేసిన గదులకు తలుపులు లేవు. సాధారణంగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు తలుపులు వేసి ఉంటే.. తీసుకోలేకపోయారని చెప్పొచ్చు. అందుకు భిన్నంగా తలుపులు తీసే ఉన్నా.. బయటకు రాలేకపోవటం ఏమిటి?

- ఊహించని రీతిలో చోటు చేసుకున్న ప్రమాదంలో మిగిలిన వారంతా షాక్ లో ఉండి.. సరిగా స్పందించలేకపోయారని.. అందుకే తమ వారిని కాపాడుకోలేకపోయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పక తప్పదు.