Begin typing your search above and press return to search.

పంజాబ్ మంత్రికి అమెరికాలో రాళ్లదాడి

By:  Tupaki Desk   |   21 July 2015 4:34 AM GMT
పంజాబ్ మంత్రికి అమెరికాలో  రాళ్లదాడి
X
దేశం కాని దేశం వెళితే.. ఘనమైన స్వాగత సత్కారాలు మాత్రమే చూశాం. కానీ.. పంజాబ్ కు చెందిన మంత్రిగారికి మాత్రం ఊహించని చేదు అనుభవం ఎదురైంది. మరో రెండేళ్లలో జరిగే పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపక్షానికి ఎన్ ఆర్ ఐ ల చేయూత కోసం.. వారి మద్ధతు కోసం పంజాబ్ మంత్రి తోతా సింగ్ అమెరికాకు వెళ్లారు.

అమెరికాలో సెటిల్ అయిన ఎన్ ఆర్ ఐల మద్ధతు పొందటం.. తమకు అండగా నిలిచేలా వారిని సమాయుత్తం చేయటం తోతాసింగ్ లక్ష్యం. అయితే.. ఆయన అనుకున్న దానికి పూర్తి భిన్నమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. రిచ్ మండ్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సిక్కు లంతా తీవ్ర ఆగ్రహంతో మంత్రిపై మండి పడ్డారు.

ఢిల్లీ.. మిగిలిన చోట్ల సిక్కుల్ని ఉచకోత కోసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవటంలో అధికారపక్షంగా పూర్తిగా విఫలమైందని మండి పడుతూ మంత్రిగారితో పాటు ఆయన వెంట వెళ్లిన బృందంపై.. తమ అగ్రహాన్ని రాళ్లతో దాడితో బయటపెట్టారు. రాళ్ల దాడితో పాటు.. ఒకరు చెప్పుతో దాడి చేయటంతో పరిస్థితి రసాబాసాగా మారిపోయింది.

ఊహించని పరిణామానికి మంత్రి బృందం షాక్ తిన్న పరిస్థితి. దేశం కాని దేశంలో ఇంత అవమానమా అంటూ బిత్తర పోయారు. పరిస్థితి హింసాత్మకంగా మారటంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎన్ ఆర్ ఐ సిక్కుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ ఆర్ ఐ లంటే షేక్ హ్యాండ్ లు.. ఆత్మీయ హగ్గులతో నాలుగు విందులు.. ఆరు పొగడ్తలుగా సాగిపోతుందని అనుకునే వారికి ఎన్ ఆర్ ఐ సిక్కులు భారీ షాక్ నే ఇచ్చారు.