Begin typing your search above and press return to search.

నీ దేశానికి వెళ్లి ఫో..అంటూ మనోడిపై కాల్పులు

By:  Tupaki Desk   |   5 March 2017 7:04 AM GMT
నీ దేశానికి వెళ్లి ఫో..అంటూ మనోడిపై కాల్పులు
X
పదాలు ఏవైనా కానీ మరో ప్రాణం మీదకు వచ్చింది. నా దేశంలో నేనే ఉండాలన్న సంకుచితం అంతకంతకూ పెరిగిపోతున్న అమెరికాలో మరో భారతీయుడు ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీనివాస్ కూఛిబొట్ల విషాదం మర్చిపోక ముందే.. హర్నీష్ పటేల్ దారుణ హత్య ఉదంతం నుంచి తేరుకోక ముందే.. మరో జాతి విద్వేష దాడి జరిగింది. 39 ఏళ్ల ఒక సిక్కు వ్యక్తిని ఇంటి బయటే కాల్చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

వాషింగ్టన్ రాష్ట్రంలోని కెంట్ సిటీలో శ్వేతజాతి దుండగుడు ఒకరు.. ‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ సిక్కు యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు సిక్కు యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. బాధితుడ్ని దీప్ రాయ్ గా పోలీసులు గుర్తించారు. అతడికి అమెరికా పౌరసత్వం ఉండటం గమనార్హం.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. తన ఇంటి దగ్గర కారు వద్ద దీప్ రాయ్ ఉన్న వేళ.. ఒక శ్వేతజాతీయుడు అతనితో వాదనకు దిగాడు. నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్లిపో అంటూ ఉన్మాదంతో అరవటం మొదలెట్టి.. ఆ పై కాల్పులు జరిపాడు. అయితే.. బుల్లెట్లు దీప్ రాయ్ చేతుల్లో నుంచి దూసుకెళ్లాయి.

దుండగుడు ఆరు అడుగుల ఎత్తు ఉన్నాడని.. మాస్క్ ధరించినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా అమెరికా పోలీసులు వెల్లడించారు. కేవలం వారం వ్యవధిలో అమెరికాలోని వేర్వేరుప్రాంతాల్లో మూడు ఉదంతాలు చోటు చేసుకోవటం.. ఇవన్నీ భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్న వైనంపై.. అమెరికాలోని భారతీయుల్లో ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

తాజాగా దీప్ రాయ్ ఉదంతంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత సంతతి సిక్కు యువకుడిపై జరిగిన దాడి వివరాల్ని వెల్లడిస్తూ.. బాధితుడి పరిస్థితి బాగుందని.. అతడు కోలుకుంటున్నట్లుగా పేర్కొంది. బాధితుడికి సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/