Begin typing your search above and press return to search.

కేజ్రీ ‘లోపలి’ కోణాన్ని బయటపెట్టిన సిద్ధూ

By:  Tupaki Desk   |   8 Sep 2016 4:14 PM GMT
కేజ్రీ ‘లోపలి’ కోణాన్ని బయటపెట్టిన సిద్ధూ
X
ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారో.. అంతే వివాదాస్పద అంశాల్ని నిత్యం చుట్టుకునే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తాజాగా మరో ఆరోపణలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు విమర్శలు.. ఆరోపణల మధ్య నలుగుతున్న కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అవాజ్ – ఇ – పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.

ఆ మధ్యన బీజేపీ ఇచ్చిన రాజ్యసభ పదవిని వదులుకొన్న సిద్ధూ.. పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరుతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను అభివర్ణించినోళ్లు చాలామందే ఉన్నారు. అయితే అవేమీ నిజం కావన్నట్లుగా సిద్ధూ కొత్తగా ఒక పార్టీని షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేజ్రీవాల్ పై సిద్ధూ చెప్పిన లోగుట్టు అంశాలు షాకింగ్ గా మారాయి.

చంఢీగఢ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. తాను రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నది కేజ్రీవాల్ కోసం కాదన్న ఆయన మరో పిడుగులాంటి మాటను చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తాను కలిసినప్పుడు ఆయన ట్వీట్ చేశారని.. ఈ సందర్భంగా సగం నిజాలు మాత్రమే చెప్పారని.. మిగిలిన సగం తాను చెబుతానన్న ఆయన.. తనను కేజ్రీ పోటీకి దిగకూడదని చెప్పినట్లుగా చెప్పారు.

అంతేకాదు.. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యను పోటీలోకి దించితే ఆమెకు మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లుగా చెప్పారు. ఈ ఆఫర్ కు తానో నమస్కారం పెట్టానని చెప్పారు. కేజ్రీవాల్ కు తన అడుగులకు మడుగులొత్తేవారే కావాలని.. ప్రజలకు ప్రజాసేవ చేయాలని భావించే వారిని ఆయన పక్కన పెడతారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘మంచివాళ్లను అలంకరణ వస్తువులుగా ఉంచి.. ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం దేశంలో కొంతకాలంగా వస్తున్న ఆచారం’’ అంటూ సూటిగా.. ఘాటైన విమర్శల్ని చేసి ‘సామాన్యుడి’ గుండెల్లో బాంబులు పేల్చినంత పని చేశారు సిద్ధూ.