Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచా.. అమ్మో పోటీచేయం..

By:  Tupaki Desk   |   26 Feb 2019 11:18 AM GMT
టీడీపీ నుంచా.. అమ్మో పోటీచేయం..
X
తెలుగుదేశం పార్టీ ఎంపీ సీటుపై పోటీ చేయడానికి నేతలు సాహసించడం లేదట. ఎందుకంటే వరుస సర్వేలు టీడీపీకి 5కు మించి ఎంపీ సీట్లు గెలవదని ప్రకటిస్తుండడంతో నేతలంతా ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుపైనే పోటీచేయడానికి ముందుకొస్తున్నారు. చంద్రబాబు ఎంత కన్విన్స్ చేస్తున్నా.. ఎంపీ సీటు కు పోటీపడడానికి నేతలు ఒప్పుకోవడం లేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

తాజాగా రిపబ్లిక్ టీవీ, టౌమ్స్ నౌ లాంటి జాతీయ చానెల్లు తెలుగు దేశం పార్టీకి ఏపీలో ఐదుకు మించి ఎంపీ స్థానాలు రావని తేల్చాయి. తెలుగుదేశం అనుకూల మీడియా సర్వేల్లో కూడా ఎంపీ సీట్లు తీసికట్టుగా వచ్చాయట.. దీంతో టీడీపీ ఇప్పుడు గెలుపు గుర్రాలైన ఎంపీలకోసం వెతుకులాట ప్రారంభించిందట..

తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. వారు మాత్రమే కాదు.. మరికొందరు ఎంపీలు కూడా ఎన్నికల వేళ వైసీపీ బాటలో పయనిస్తారని సమాచారం అందుతోంది. పోతూ పోతూ కొందరు ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో తీసుకొస్తున్నారట ఎంపీ అభ్యర్థులు.

తాజాగా అనంతపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడతారని ప్రచారం జరిగిన జేసీ పవన్ విరమించుకున్నారు. తాను ఎమ్మెల్యేగానే పోటీచేస్తానని.. ఎంపీ టికెట్ వద్దని టీడీపీకీ వర్తమానం చేరవేశారట.. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. కర్నూలులో కోట్లకు టీడీపీ గాలం వేస్తోంది. నంద్యాలలో టీడీపీ క్యాండిడేట్ లేని పరిస్థితి. అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇక ఉత్తరాంధ్రలో కూడా టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారట..

ఇలా ఎటూ చూసినా ఎన్నికల వేళ టీడీపీ గెలవదన్న అంచనాలతో ఆ పార్టీ తరుఫున ముఖ్యంగా ఎంపీగా పోటీచేయడానికి నేతలు సాహసించడం లేదు. ఎంతలేదన్నా 50 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండడం.. గెలుపు గ్యారెంటీ లేకపోవడంతో టీడీపీకి ఎంపీ అభ్యర్థుల కొరత వేధిస్తోంది.